K Kavitha: సోనియా, రాహుల్ గాంధీ అన్యాయాన్ని చూస్తూ కూర్చున్నారు: ఎమ్మెల్సీ కవిత

  • కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఫన్నీగా ఉన్నాయని వ్యాఖ్య
  • విశ్వాసమున్న నేతలు, పార్టీలనే ప్రజలు నమ్ముతారన్న కవిత
  • మహిళా రిజర్వేషన్ బిల్లును ఇప్పుడైనా ప్రవేశపెట్టాలని విజ్ఞప్తి
MLC Kavitha on Congress Guarantees

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీ స్కీమ్‌లపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. ఆమె ఎన్టీవీతో మాట్లాడుతూ... కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలు ఫన్నీగా ఉన్నాయన్నారు. 

ఈ పదేళ్లలో తెలంగాణ గురించి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ఏమీ మాట్లాడలేదన్నారు. తొమ్మిది మండలాలను తెలంగాణ నుండి ఏపీలో కలిపితే వారిద్దరు ప్రశ్నించలేదన్నారు. వారు ఈ అన్యాయాన్ని చూస్తూ కూర్చున్నారన్నారు. అలాంటి వారు రేపు తెలంగాణలో అధికారంలోకి వస్తే ఏం చేస్తారని కవిత ప్రశ్నించారు. 

తెలంగాణ ప్రజలకు అన్నీ తెలుసునని, ఎవరికి ఓటేస్తే బాగుంటుందో తెలుసునన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఆలస్యం చేసినట్లు, వారు ఇచ్చిన హామీలు కూడా అధికారంలోకి రాగానే చేస్తారనే గ్యారెంటీ లేదని, వాటినీ ఆలస్యం చేయవచ్చునన్నారు. విశ్వసనీయ నేతలు, పార్టీలనే ప్రజలు నమ్ముతారన్నారు.

మహిళా రిజర్వేషన్ బిల్లుపై...

కొత్త పార్లమెంట్‌లో అయినా మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని కవిత విజ్ఞప్తి చేశారు. ఈ బిల్లు ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉందన్నారు. కొత్త పార్లమెంట్ భవనంలో మహిళలకు కొత్త లక్కు కలిసి వస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు.

More Telugu News