Andhra Pradesh: కూతురు ఫస్ట్ బర్త్ డేకు మరిచిపోలేని గిఫ్ట్ ఇచ్చిన తండ్రి

  • చందమామపై ఎకరా భూమి కొనిచ్చిన మదనపల్లె వాసి
  • ఇందుకోసం రూ.11,600 వెచ్చించినట్లు వెల్లడి
  • ఆదివారం డాక్యుమెంట్లు అందుకున్న షేక్ ఆసిఫ్
AN INNOVATIVE IDEA OF MADANAPALLE YOUTH

కూతురు మొదటి పుట్టిన రోజుకు అపురూపమైన కానుక ఇవ్వాలని భావించిన ఓ తండ్రి ఏకంగా చంద్రుడిపైన ఎకరం భూమిని కొనిచ్చాడు. ఆ భూమిని తన కూతురు పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాడు. అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందిన షేక్ ఆసిఫ్ తన కూతురుకు ఈ కానుక ఇచ్చాడు. బెంగళూరులోని ఓ ప్రైవేట్ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న షేక్ ఆసిఫ్ కు గతేడాది నవంబర్ లో కూతురు పుట్టింది. మైషా అని పేరు పెట్టారు. మైషాను అపురూపంగా పెంచుకుంటున్న ఆసిఫ్.. తొలి బర్త్ డేకు అంతే అపురూపమైన కానుక ఇవ్వాలని భావించినట్లు తెలిపారు.

చంద్రయాన్ 3 తర్వాత జాబిల్లిపై ల్యాండ్ అమ్మకాలు పెరిగాయి. ఈ వార్తలను పత్రికలలో చూసిన ఆసిఫ్ తన కూతురు కోసం చంద్రుడిపై ల్యాండ్ కొనాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం అమెరికాకు చెందిన లూనార్‌ సొసైటీ ఇంటర్నేషనల్‌ సంస్థను సంప్రదించారు. చంద్రుడిపై ఒక ఎకరా భూమి కొనుగోలుకు దరఖాస్తు చేసుకోగా.. బే ఆఫ్‌ రెయిన్‌బో ప్రాంతంలో భూమి విక్రయిస్తున్నట్లు ఆసిఫ్ కు మెయిల్‌ పంపింది. ఎకరా ధరకు రిజిస్ట్రేషన్ సహా ఇతరత్రా చార్జీలు కలిపి మొత్తం రూ.11,600 ఖర్చవుతుందని తెలపగా.. ఆసిఫ్ ఆన్ లైన్ లో పేమెంట్ చేశారు. దీంతో షేక్ మైషా పేరుతో చంద్రుడిపై ఎకరా భూమిని రిజిష్టర్ చేసిన లూనార్ సొసైటీ ఇంటర్నేషనల్.. ఆ కాగితాలను ఆసిఫ్ కు రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపించింది. ఆదివారం ఈ డాక్యుమెంట్లను అందుకున్నట్లు ఆసిఫ్ మీడియాకు తెలిపారు.

More Telugu News