Ghaziabad Gym: 19 ఏళ్లకే హార్ట్ అటాక్.. జిమ్‌లో కసరత్తులు చేస్తూ యువకుడి మృతి

  • ఉత్తరప్రదేశ్ ఘాజియాబాద్‌లోని జిమ్‌లో కసరత్తులు చేస్తూ 19 ఏళ్ల యువకుడి మృతి
  • గుండెపోటుతో అకస్మాత్తుగా కుప్పకూలిపోయిన వైనం
  • వెంటనే ఆసుపత్రికి తరలించినా దక్కని ఫలితం
  • కుమారుడి మృతితో తల్లిదండ్రులు కన్నీటిపర్యంతం
Man Dies Of Heart Attack While Running On Treadmill At Ghaziabad Gym

ఉత్తరప్రదేశ్‌లో శనివారం షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఘాజియాబాద్‌లోని జిమ్‌లో 19 ఏళ్ల సిద్ధార్థ్ కుమార్ సింగ్ కసరత్తులు చేస్తూ అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. ట్రెడ్‌మిల్‌పై పరిగెడుతున్న అతడికి గుండెపోటు రావడంతో క్షణాల్లో ప్రాణాలు కోల్పోయాడు. ఇందుకు సంబంధించిన షాకింగ్ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. 

ట్రెడ్ మిల్‌పై పరిగెడుతున్న అతడు క్షణాలవ్యవధిలో స్పృహ కోల్పోయి కింద పడిపోయాడు. పక్కనే ఉన్న వారు వెంటనే స్పందించి అతడ్ని తట్టిలేపే ప్రయత్నం చేసినా యువకుడిలో కదలికలు రాలేదు. ఆ తరువాత ఆసుపత్రికి తరలించినా ఉపయోగం లేకపోయింది. సిద్ధార్థ్ సింగ్ నోయిడాలోని ఓ కాలేజీలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. నోయిడాలోనే తన తండ్రి వద్ద ఉంటున్నాడు. అతడి తల్లి బీహార్‌‌లో ప్రభుత్వ టీచర్‌గా పనిచేస్తున్నారు. ఆ దంపతులకు సిద్ధార్థ్ ఒక్కడే సంతానం కావడంతో వారి దుఃఖానికి అంతేలేకుండా పోయింది. అంతకు కొద్ది నిమిషాల ముందే సిద్ధార్థ్ తనతో ఫోన్లో మాట్లాడాడంటూ అతడి తల్లి కన్నీరుమున్నీరైంది. యువకుడి మృతదేహాన్ని అతడి తండ్రి తమ స్వస్థలానికి తీసుకెళ్లారు.

More Telugu News