CM KCR: తెలంగాణలో ఒకేసారి 9 మెడికల్ కాలేజీలు ప్రారంభించిన సీఎం కేసీఆర్

  • వర్చువల్ విధానంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభం
  • అందుబాటులోకి రానున్న 900 మెడికల్ సీట్లు
  • వచ్చే ఏడాది మరో 8 మెడికల్ కాలేజీలు ప్రారంభిస్తామన్న సీఎం కేసీఆర్
  • తెలంగాణ వైట్ కోట్ డాక్టర్లు దేశానికే కీలకంగా మారతారని వెల్లడి 
CM KCR inaugurates 9 medical colleges in Telangana

తెలంగాణలో నూతన వైద్య కళాశాలలను సీఎం కేసీఆర్ ఇవాళ ప్రారంభించారు. ఏకకాలంలో 9 మెడికల్ కాలేజీలను ఆయన వర్చువల్ విధానంలో ప్రారంభించారు. కరీంనగర్, జనగాం, నిర్మల్, కామారెడ్డి, ఆసిఫాబాద్, సిరిసిల్ల, ఖమ్మం, వికారాబాద్, భూపాలపల్లిలో ఈ మెడికల్ కాలేజీలు నెలకొల్పారు. ఈ కాలేజీల ద్వారా రాష్ట్రంలో కొత్తగా 900 మెడికల్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. కొత్త కాలేజీలతో కలిపి తెలంగాణలో మెడికల్ కాలేజీల సంఖ్య 29కి చేరింది. 

ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, ఇది చాలా గొప్ప సన్నివేశం అని, ఆత్మతృప్తికి సంబంధించిన విషయమని అన్నారు. పరిపాలన చేతకాదు అంటూ హేళనలను ఎదుర్కొన్న పరిస్థితి నుంచి ఇవాళ ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసుకునే దశకు ఎదిగామని వెల్లడించారు. 

వచ్చే విద్యా సంవత్సరం నాటికి మరో 8 మెడికల్ కాలేజీలు ప్రారంభిస్తామని, అందుకు కేబినెట్ ఆమోదం కూడా లభించిందని కేసీఆర్ వివరించారు. నూతన రాష్ట్రం వచ్చినప్పుడు తెలంగాణలో 2,850 మెడికల్ సీట్లు ఉంటే, ఇప్పుడు 8,515 సీట్లు ఉన్నాయని అన్నారు. ఈ సందర్భంగా వైద్య శాఖ మంత్రిని, కార్యదర్శిని అభినందిస్తున్నానని తెలిపారు. 

తెలంగాణలోని అన్ని మెడికల్ కాలేజీల ద్వారా ఏడాదికి పదివేల మంది వైద్యులను తయారు చేయబోతున్నామని పేర్కొన్నారు. మనిషి ఆరోగ్యానికి తెల్ల  రక్త కణాలు ఎంతో ముఖ్యమని, అలాగే రాష్ట్ర వైద్య రంగానికే కాకుండా, దేశ వైద్య రంగానికి కూడా తెలంగాణ ఉత్పత్తి చేయబోయే తెల్ల కోట్ డాక్టర్లు కీలకంగా మారతారని సీఎం కేసీఆర్ అభివర్ణించారు.

More Telugu News