India: పాకిస్థాన్ క్రికెట్ జట్టుతో ద్వైపాక్షిక సిరీస్ లపై వైఖరి వెల్లడించిన కేంద్రం

  • చాన్నాళ్లుగా ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు జరగని వైనం
  • పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ఆపాల్సిందేనంటున్న భారత్
  • 2012-13లో చివరిసారిగా దాయాదుల మధ్య ద్వైపాక్షిక సిరీస్ 
  • కేవలం ఐసీసీ ఈవెంట్లు, ఇతర టోర్నీల్లోనే తలపడుతున్న భారత్-పాక్
Center reiterated their stand on Indo Pak bilateral cricket series

సరిహద్దు సమస్యలు, ఉగ్రవాదం, రాజకీయ కారణాలతో భారత్, పాకిస్థాన్ మధ్య క్రికెట్ సంబంధాలు అంతంత మాత్రంగా ఉన్నాయి. 2012-13 సీజన్ లో ఇరుదేశాల మధ్య చివరి ద్వైపాక్షిక సిరీస్ జరిగింది. అప్పటి నుంచి భారత్, పాకిస్థాన్ జట్లు కేవలం ఐసీసీ ఈవెంట్లు, ఇతర టోర్నీల్లోనే తలపడుతున్నాయి. 

కాగా, కశ్మీర్ ఎన్ కౌంటర్ లో ముగ్గురు సైనికాధికారులు వీరమరణం పొందిన నేపథ్యంలో, కేంద్రం భారత్-పాక్ ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ లపై తన వైఖరి మరోసారి వెల్లడించింది. ఉగ్రవాదానికి అడ్డుకట్ట వేసేంతవరకు పాకిస్థాన్ తో ద్వైపాక్షిక క్రికెట్ ఆడేది లేదని కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు. దేశ ప్రజల అభిప్రాయాలు కూడా తమకు ముఖ్యమేనని, ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోమని తెలిపారు. సీమాంతర ఉగ్రవాదాన్ని పాక్ ఆపాల్సిందేనని, అప్పుడే పాక్ తో ఎలాంటి క్రీడా కార్యక్రమాలైనా జరుగుతాయని వివరించారు. 

బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పాకిస్థాన్ తో ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ లకు సంబంధించి తమ వద్ద స్పష్టమైన విధానం ఉందని అన్నారు. ఉగ్రవాదంపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

More Telugu News