Nipah Virus: నిఫా వైరస్ నియంత్రణకు రూ.100 కోట్లు: కేంద్రం

  • కేరళలో పెరుగుతున్న వైరస్ కేసులు
  • గురువారం మరో కేసును గుర్తించిన వైద్యులు
  • మొత్తం ఆరుకు చేరిన వైరస్ బాధితులు
100 Crores Released to District Labs in Kerala says Minister Mandaviya After Nipah Outbreak

కేరళలో కలకలం సృష్టిస్తున్న నిఫా వైరస్ పై కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. వైరస్ నియంత్రణకు రూ.100 కోట్ల నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. కేరళలలోని వివిధ జిల్లాలలో ఉన్న లేబరేటరీలకు ఈ నిధులు విడుదల చేస్తూ వైరస్ ను నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ శుక్రవారం ఓ మీడియా సంస్థకు వివరాలు వెల్లడించారు. వైరస్ నిర్ధారణ పరీక్షలతో పాటు బాధితులకు అవసరమైన చికిత్స అందించడం, వైరస్ నియంత్రణ చర్యలకు ఈ నిధులు ఉపయోగించాలని అధికారులకు మంత్రి సూచించారు.

కరోనా మహమ్మారి వ్యాప్తితో కేంద్ర ఆరోగ్య శాఖ చాలా పటిష్ఠంగా తయారైందని, దేశంలోని ఏ మారుమూల పల్లెలో అయినా ఎలాంటి వైరస్ బయటపడినా వెంటనే తెలుసుకునేలా ఏర్పాట్లు చేశామని మంత్రి చెప్పారు. ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెంట్రల్ కమాండ్ సిస్టం ద్వారా వైరస్ ఉనికిని వెంటనే తెలుసుకోగలుగుతున్నట్లు వివరించారు. కేరళలో నిఫా వైరస్ నియంత్రణకు జిల్లా స్థాయిలో ఇప్పటికే ఉన్న ల్యాబ్ లకు అదనంగా మరిన్ని కొత్త ల్యాబ్ లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

కేరళలో తాజాగా మరొకరికి నిఫా వైరస్ సోకినట్లు గుర్తించామని మంత్రి మాండవీయ తెలిపారు. దీంతో కేరళలో నిఫా బాధితుల సంఖ్య ఆరుకు చేరిందన్నారు. వైరస్ బారిన పడి ఇప్పటికే ఇద్దరు చనిపోయారని వివరించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి నిఫా వైరస్ నియంత్రణకు మెరుగైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వైరస్ కేసులు బయటపడ్డ గ్రామాలతో పాటు చుట్టుపక్కల తొమ్మిది గ్రామాల్లో కంటైన్ మెంట్ ప్రకటించామని మంత్రి చెప్పారు. వైరస్ వ్యాప్తి విషయంలో ప్రభుత్వాలు అలర్ట్ గా ఉన్నాయని, ప్రజలు భయాందోళనలకు లోనవ్వాల్సిన అవసరంలేదని మంత్రి ధైర్యం చెప్పారు.

More Telugu News