Vellampalli Srinivasa Rao: సొంతపుత్రుడి కంటే దత్తపుత్రుడే ఎక్కువ బాధపడిపోతున్నాడు: వెల్లంపల్లి

  • రాజమండ్రి జైలులో చంద్రబాబును కలిసిన పవన్
  • వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ కలిసి పోటీచేస్తాయని వెల్లడి
  • దత్తపుత్రుడు అనే పేరుకు పవన్ సార్థకత చేకూర్చాడన్న వెల్లంపల్లి
  • చంద్రబాబుకు తానే వారసుడ్ని అనేలా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యలు
Vellampalli take jibe at Pawan Kalyan

రాజమండ్రి జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ కలవడంపై వైసీపీ ఎమ్మెల్యే, మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఘాటుగా స్పందించారు. ఆయనను దత్తపుత్రుడు అంటుంటారు కదా... దత్తపుత్రుడు అనే పేరుకు ఇవాళ సార్థకత చేకూర్చాడని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసే పోటీ చేస్తాయని తమకు తెలుసని, ఇదేమీ తమకు కొత్తగా అనిపించడంలేదని అన్నారు. 

గత మూడ్రోజులుగా చూస్తున్నాం... సొంత పుత్రుడి కంటే దత్తపుత్రుడి హడావిడి ఎక్కువగా ఉంది... చంద్రబాబుకు తానే వారసుడ్ని అనేలా వ్యవహరిస్తున్నారు అంటూ వెల్లంపల్లి పేర్కొన్నారు. 

"పవన్ కల్యాణ్ ఇవాళ రాజమండ్రి వచ్చి జైలులో ఉన్న దత్తతండ్రిని కలిశాడు. టీడీపీతో కలిసి నడుస్తామని, బీజేపీని కూడా కలుపుకుని వెళతామని జైలు బయట ప్రకటించడం ద్వారా తన ముసుగును తీసేశాడు. ఇదే రాజమండ్రిలో పుష్కరాల్లో 30 మంది చనిపోతే పవన్ కల్యాణ్ ఎందుకు పరామర్శించలేదు?" అని ప్రశ్నించారు. 

"మా ముఖ్యమంత్రి గారు మొదటి రోజు నుంచీ చెబుతూనే ఉన్నారు... చంద్రబాబు, పవన్ కల్యాణ్ వేర్వేరు కాదు అని. వాళ్లిద్దరూ ఒకటే  ఫ్యామిలీ! 2019లో ఓటు చీలకుండా చూసేందుకే జనసేన విడిగా పోటీ చేసింది. ఇప్పుడు మళ్లీ టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసినా, మేం భయపడడంలేదు. ఎన్నికల్లో ఎవరు ఎవరితో కలిసొచ్చినా ఎదుర్కొనేందుకు వైసీపీ సిద్ధంగా ఉంది. 

అయినా, పవన్ కల్యాణ్ కు సిగ్గుందా అని అడుగుతున్నాను. యువతను మోసం చేసి రూ.241 కోట్ల అవినీతికి పాల్పడిన వ్యక్తి చంద్రబాబు. చంద్రబాబు పీఏ స్టేట్ మెంట్లు, ఈడీ విచారణలు, అరెస్టులు ఇవన్నీ తెలిసి కూడా ఎలా మాట్లాడుతున్నావయ్యా నువ్వు! దిక్కుమాలిన నీచ రాజకీయాల కోసం చంద్రబాబును వెనకేసుకుని వస్తావా? నాశనం అయిపోతావ్ నువ్వు కూడా. 

మళ్లీ చంద్రబాబును పట్టుకుని వెళుతున్నావ్... నీకు సున్నానే. నీ జీవితంలో రాజకీయాల్లో ఎదగలేవు. పవన్ కల్యాణ్.. 2024 ఎన్నికలే నీకు చివరివి. జగన్ ను గద్దె దించడమే లక్ష్యమని పార్టీ పెట్టినప్పటి నుంచి చెబుతున్నావు... చంద్రబాబుతో కలిసి ఏం పీకావు నువ్వు? ఎవరిపై యుద్ధం చేస్తావు నువ్వు?

పవన్ జీవితం ఎలాంటిదో అందరికీ తెలుసు. అతను రాజకీయాల్లో కూడా అంతే. ఒకరితో పెళ్లి... మరొకరితో కాపురం! ఇదేమీ కొత్త కాదు. పవన్ కల్యాణ్ ప్యాకేజీ కోసమే పార్టీ పెట్టాడు. మా ముఖ్యమంత్రి ప్రజలను నమ్ముకున్నాడు. పవన్ కల్యాణ్ చంద్రబాబును నమ్ముకుని ప్యాకేజీ తీసుకుని పరిగెడుతుంటాడు. సిగ్గులేకుండా 25 సీట్లకు, 35 సీట్లకు అమ్ముడుపోయే వీడా మమ్మల్ని బెదిరించేది! పవన్ కల్యాణ్ లాంటి వాళ్లను చాలామందిని చూశాం... ఏం పీక్కుంటాడో పీక్కోమనండి! 

ఓవైపు లోకేశ్ యువగళం యాత్ర చేస్తున్నాడు, పవన్ కల్యాణ్ వారాహి యాత్ర చేస్తున్నాడు, చంద్రబాబు ముసలి యాత్ర చేస్తున్నాడు... వీళ్లందరి అజెండా ఒక్కటే. ఇకనుంచి టీడీపీ, జనసేన కలిసి వస్తాయేమో కానీ, వచ్చే ఎన్నికల్లో గెలిచేది మేమే... అది కూడా 175 స్థానాల్లో గెలవబోతున్నాం" అని వెల్లంపల్లి స్పష్టం చేశారు.

More Telugu News