Mallikarjun Kharge: ఉత్తరప్రదేశ్ నుంచి బరిలోకి దిగనున్న ఖర్గే? కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచన వెనుక భారీ వ్యూహం!

  • దళిత ఓటర్లను తమ వైపు తిప్పుకోవడమే కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచన
  • ఇండియా కూటమిలోని సమాజ్ వాదీ పార్టీకి కూడా మేలు కలుగుతుందని అంచనా
  • యూపీలో రాజకీయంగా బలహీనపడ్డ దళిత అగ్ర నాయకురాలు మాయావతి
Speculations that Mallikarjun Kharge will contest from Uttar Pradesh in Lok Sabha elections

దేశ వ్యాప్తంగా అప్పుడే లోక్ సభ ఎన్నికలు హడావుడి నెలకొంది. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి, ఎలాగైనా మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమి పట్టుదలగా ఉన్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక ఆసక్తికర వార్త వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్ లో వరుసగా రెండు సార్లు కాంగ్రెస్ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యూపీలో పార్టీని బలోపేతం చేసే దిశగా కాంగ్రెస్ కొత్త వ్యూహాలను రచిస్తోంది. 

రానున్న పార్లమెంటు ఎన్నికల్లో యూపీ నుంచి తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను బరిలోకి దించే యోచనలో కాంగ్రెస్ ఉంది. దేశంలో అతి పెద్ద రాష్ట్రమైన యూపీ నుంచి ఖర్గేను ఎన్నికల బరిలోకి దించితే... దళిత ఓటర్లను తమవైపు తిప్పుకోవచ్చని హైకమాండ్ భావిస్తున్నట్టు సమాచారం. ఉత్తరప్రదేశ్ లో బలమైన దళిత నేతగా బీఎస్పీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మాయావతి ఉండేవారు. అయితే, ఇప్పుడు ఆమె రాజకీయంగా చాలా బలహీనపడ్డారు. దీంతో, ఆ స్థానాన్ని తాము మాత్రమే భర్తీ చేయగలమనే భావనలో ఏఐసీసీ ఉంది. ఈ నేపథ్యంలోనే ఖర్గేను యూపీ నుంచి దింపాలనుకుంటోంది. ఖర్గేను బరిలోకి దింపితే యూపీలో కాంగ్రెస్ తో పాటు ఇండియా కూటమిలో ఉన్న సమాజ్ వాదీ పార్టీకి కూడా బలం చేకూరుతుందని కాంగ్రెస్ అగ్ర నేతలు భావిస్తున్నారు. మరి ఈ ఆలోచన ఎంత మేరకు వాస్తవ రూపం దాలుస్తుందనే విషయాన్ని వేచి చూడాలి.

More Telugu News