Team India: ​నిన్నటి జోరు ఇవాళ లేదు... శ్రీలంకపై ఓ మోస్తరు స్కోరు చేసిన భారత్

  • ఆసియా కప్ సూపర్-4లో నేడు భారత్ × శ్రీలంక
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
  • 49.1 ఓవర్లలో 213 పరుగులకు భారత్ ఆలౌట్
  • 5 వికెట్లు తీసిన వెల్లాలగే... 4 వికెట్లు పడగొట్టిన అసలంక
Team India set Sri Lanka 214 runs target

శ్రీలంక జట్టుతో కొలంబోలో జరుగుతున్న ఆసియా కప్ సూపర్-4 మ్యాచ్ లో టీమిండియా స్వల్ప స్కోరుతోనే సరిపెట్టుకుంది. నిన్న పాకిస్థాన్ పై అర్ధసెంచరీలు, సెంచరీలతో జూలువిదిల్చిన భారత బ్యాట్స్ మెన్ ఇవాళ పరుగుల కోసం చెమటోడ్చారు. శ్రీలంక స్పిన్ దాడులతో విజృంభించగా... వికెట్లు కాపాడుకోవడానికి భారత బ్యాటర్లు విఫల యత్నాలు చేశారు.

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ చివరికి 49.1 ఓవర్లలో 213 పరుగులకు ఆలౌట్ అయింది. చివర్లో వర్షం అంతరాయం కలిగించినా, కొద్దిసేపటి తర్వాత మ్యాచ్ మళ్లీ ప్రారంభమైంది. 

యువ లెఫ్టార్మ్  స్పిన్నర్ దునిత్ వెల్లాలగే 5 వికెట్లతో భారత్ పతనంలో కీలక భూమిక పోషించాడు. మరో స్పిన్నర్ చరిత్ అసలంక 4 వికెట్లతో భారత లోయరార్డర్ పనిబట్టాడు. మిస్టరీ స్పిన్నర్ తీక్షణకు ఓ వికెట్ దక్కింది. 

టీమిండియా ఇన్నింగ్స్ లో కెప్టెన్ రోహిత్ శర్మ అర్ధసెంచరీ చేయగా, ఇషాన్ కిషన్ 33, కేఎల్ రాహుల్ 39 పరుగులు చేశారు. చివర్లో అక్షర్ పటేల్ 26 పరుగులు సాధించాడు. వీళ్లు మినహా మరెవ్వరూ రాణించలేదు.

More Telugu News