PoK: పాక్ ఆక్రమిత కశ్మీర్ పై కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు

  • త్వరలో ఆ ప్రాంతం మొత్తం భారత్ లో కలుస్తుందన్న వీకే సింగ్
  • మనం కాస్త ఓపిక పడితే చాలు.. దానికదే ముందుకు వస్తుందని వెల్లడి
  • భారత్ లో కలుస్తామంటూ ఇటీవల విజ్ఞప్తి చేసిన పీవోకే జనం
PoK will Merge With India says Union Minister VK Singh Makes A Big Claim

పాకిస్థాన్ ఆక్రమించుకున్న కశ్మీర్ మన దేశంలో కలిసే రోజు మరెంతో దూరంలో లేదని కేంద్రమంత్రి వీకే సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్ లోని దౌసాలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) మన భూభాగంలో కలుస్తుందని చెప్పారు. ఇందుకు భారత్ చేయాల్సిందేమీ లేదని, కాస్త ఓపికతో ఎదురుచూస్తే పీవోకే ప్రజలు స్వచ్ఛందంగా వచ్చేస్తారని వివరించారు. భారతదేశంలో కలుస్తామంటూ ఇటీవల పీవోకేలో జనం భారీ ఎత్తున ఆందోళనలు చేశారు. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి, రిటైర్డ్ జనరల్ అయిన వీకే సింగ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి నానాటికీ దిగజారిపోతోంది. దీంతో పాక్ ప్రభుత్వం విద్యుత్ బిల్లును మూడు నెలల్లోనే మూడు రెట్లు పెంచేసింది. నిత్యావసర ధరలపైనా పన్నులు పెంచింది. ఫలితంగా ధరలు విపరీతంగా పెరిగాయి. ఈ క్రమంలో కనీస అవసరాలు తీరక జనం ఇబ్బంది పడుతున్నారు. పీవోకేలో ప్రజల పరిస్థితి అధ్వానంగా తయారైంది. తమ భూభాగాన్ని పాక్ చెర నుంచి విడిపించి భారత్ లో కలిపేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీకి అక్కడి ప్రజలు విజ్ఞప్తి చేశారు. పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా చేశారు. భారత్ లో కలిసిపోవాలన్న డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోందని పాకిస్థాన్ హక్కుల కార్యకర్త షబీర్ చౌధరి తాజాగా వెల్లడించారు.

More Telugu News