Nipah Virus: కేరళలో రెండు అసహజ మరణాలు.. అప్రమత్తమైన ప్రభుత్వం

  • కోజీకోడ్ జిల్లాలో సంభవించిన రెండు అసహజ మరణాలకు నీపా వైరస్ కారణమని అనుమానాలు
  • మృతుల బంధువుల్లో ఒకరు అనారోగ్యంతో ఆసుపత్రిపాలు, ఐసీయూలో చికిత్స
  • అప్రమత్తమైన ప్రభుత్వం
  • ఆరోగ్య శాఖ మంత్రి ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం    
Nipah Alert Sounded In Kerala After Two Unnatural Deaths

కేరళలోని కోజీకోడ్ జిల్లాలో రెండు అసహజ మరణాలు సంభవించడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. నీపా వైరస్ కారణంగా బాధితులు మరణించారన్న అనుమానాల నడుమ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ సోమవారం అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఈ మరణాలు సంభవించినట్టు ప్రభుత్వం పేర్కొంది. మృతుల బంధువు ఒకరు అనారోగ్యం కారణంగా ఐసీయూలో చికిత్స పొందుతున్నట్టు కూడా వెల్లడించింది. దక్షిణ భారతంలో తొలి నిపా వైరస్ కేసు 2018లో కోజీకోడ్ జిల్లాలోనే బయటపడింది. 

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, జంతువుల ద్వారా మనుషులకు ఈ వైరస్ వ్యాపిస్తుంది. కలుషితమైన ఆహారం లేదా వ్యాధి బారినపడ్డ వారి సమీపంలోకి వెళితే ఇన్‌ఫెక్షన్ బారిన పడతారు. 

నీపా వైరస్ రోగుల్లో కొందరికి ఎటువంటి లక్షణాలు ఉండవు. మరికొందరిలో మాత్రం ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు కనిపిస్తే, ఇంకొందరు ప్రాణాంతకమైన మెదడువాపు బారినపడతారు. పందుల వంటి జంతువులకూ సోకే నీపా వైరస్‌తో రైతులకు భారీ అర్థికనష్టం జరుగుతుందని కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది.

More Telugu News