Nara Lokesh: బాధతో, బరువెక్కిన గుండెతో, కన్నీళ్లతో ఈ లేఖ రాస్తున్నా: నారా లోకేశ్

  • చంద్రబాబుకు రిమాండ్
  • తీవ్ర భావోద్వేగాలకు గురైన నారా లోకేశ్
  • చంద్రబాబుకు ఇంత అన్యాయం ఎందుకు జరిగిందంటూ ఆక్రోశం
  • ఈ యుద్ధంలో తనతో కలిసి రావాలంటూ ప్రజలకు పిలుపు 
Nara Lokesh penned emotional letter

కోనసీమ జిల్లాలో యువగళం పాదయాత్ర చేపడుతున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్... చంద్రబాబును సీఐడీ అరెస్ట్ చేయడంతో పాదయాత్ర నిలిపివేశారు. నిన్న హుటాహుటీన ఉండవల్లి నివాసానికి చేరుకున్నారు. గత రాత్రి కుంచనపల్లి సిట్  కార్యాలయంలో చంద్రబాబును కలిసిన లోకేశ్... ఇవాళ విజయవాడ ఏసీబీ కోర్టు వద్ద చంద్రబాబు వెంటే ఉన్నారు. 

తండ్రికి రిమాండ్ విధించిన సమయంలో లోకేశ్ తీవ్ర భావోద్వేగాలకు గురయ్యారు. తన వేదనను ఆయన ఓ లేఖ రూపంలో పంచుకున్నారు. "ఇవాళ బాధతో, బరువెక్కిన గుండెతో, కన్నీటి పర్యంతమవుతూ ఈ లేఖ రాస్తున్నా. ఆంధ్రప్రదేశ్ కోసం, తెలుగు ప్రజల కోసం మా నాన్న మనసా వాచా కర్మణా తన హృదయాన్ని ధారపోయడం నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా. 

ఆయన ఏనాడూ ఒక్కరోజైనా విశ్రాంతి తీసుకున్నది లేదు. కోట్లాది ప్రజల జీవితాలను బాగుచేయడం కోసం అలుపెరగకుండా శ్రమిస్తున్నారు. ఆయన రాజకీయాలు హుందాగా, నిజాయతీతో కూడుకున్నవి. తాను ఎవరికైతే సేవ చేశాడో వారి నుంచి లభించే ప్రేమ, కృతజ్ఞతలోంచే లోతైన ప్రేరణ పొందడాన్ని నేను చూశాను. వారు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పినప్పుడు చిన్నపిల్లాడిలా సంబరపడిపోయేవారు. 

నేను సైతం ఆయన ఎంచుకున్న మహత్తరమైన మార్గంలో నడవాలని కోరుకున్నాను, ఆయన నుంచి ఘనమైన స్ఫూర్తిని పొందాను. అందుకోసం అమెరికాలో మంచి ఉద్యోగాన్ని కూడా వదులుకుని వచ్చేశాను. ఇది చాలా కఠిన నిర్ణయం అయినప్పటికీ, మన దేశం పట్ల, మన వ్యవస్థల పట్ల, మన దేశ వ్యవస్థాపక సూత్రాల పట్ల, అన్నింటికి మించి మన రాజ్యాంగం పట్ల విశ్వాసం నన్ను ముందుకు నడిపించింది. 

ఇవాళ మా నాన్న చేయని తప్పుకు రిమాండ్ కు వెళుతున్నారు. నా రక్తం ఉడికిపోతోంది, నా కోపం కట్టలు తెంచుకుంటోంది. ఈ రాజకీయ కక్షలు కార్పణ్యాలకు అంతే లేదా? దేశం కోసం, రాష్ట్రం కోసం, తెలుగు ప్రజల కోసం ఎంతగానో తపించి, వారి అభివృద్ధి కోసం ఎంతగానో పాటుపడిన మా నాన్న వంటి వ్యక్తికి ఇంత అన్యాయం ఎందుకు జరిగింది? అసలు, దీన్ని ఎందుకు భరించాలి?

ఆయనెప్పుడూ విద్వేష రాజకీయాలకు పాల్పడలేదు, విధ్వంసక చర్యలకు దిగలేదు. మరి అభివృద్ధిని కాంక్షించినందుకు, ఇతరుల కంటే ముందే మన ప్రజలకు సంక్షేమ ఫలాలు, అవకాశాలు అందాలని పరితపించినందుకు ఇలా జరిగిందా? ఇవాళ జరిగిందంతా చూస్తుంటే ఒక నమ్మకద్రోహంలా అనిపిస్తోంది. కానీ మా నాన్న ఒక పోరాట యోధుడు. నేను కూడా మా నాన్న లాంటివాడ్నే. 

ఆంధ్రప్రదేశ్ కోసం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల కోసం అచంచలమైన సంకల్ప శక్తితో, తిరుగులేని శక్తిలా ఎదుగుతాం. ఈ యుద్ధంలో నాతో కలసి రండి... అందుకు ఇదే నా పిలుపు" అంటూ లోకేశ్ తన లేఖలో పేర్కొన్నారు.

More Telugu News