Chandrababu: చంద్రబాబు వెంట రాజమండ్రికి నారా లోకేశ్

  • చంద్రబాబుకు రిమాండ్
  • ఏసీబీ కోర్టు నుంచి రాజమండ్రి జైలుకు తరలిస్తున్న అధికారులు
  • జైలులో చంద్రబాబుకు ప్రత్యేక సదుపాయాలు కల్పించాలన్న ఏసీబీ కోర్టు
  • ఇంటి నుంచి భోజనానికి అనుమతించాలని జైలు అధికారులకు ఆదేశాలు
CID officials takes Chandrababu to Rajahmundry prison

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు రిమాండ్ ను హౌస్ అరెస్ట్ గా మార్చాలన్న టీడీపీ న్యాయవాదుల బృందం ప్రయత్నాలు ఫలించలేదు. ఏసీబీ కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది. అయితే రాజమండ్రి జైలులో చంద్రబాబుకు ప్రత్యేక గది కేటాయించాలని ఆదేశించింది. జైలులో చంద్రబాబుకు ప్రత్యేక వసతులు కల్పించాలని స్పష్టం చేసింది. 

చంద్రబాబు మాజీ సీఎం, ప్రతిపక్ష నేత కావడంతో ఆయనకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలన్న ఆయన న్యాయవాదుల విజ్ఞప్తికి ఏసీబీ కోర్టు సమ్మతి తెలిపింది. చంద్రబాబుకు అవసరమైన ఔషధాలు, వైద్య చికిత్స అందించాలని ఆదేశించింది. చంద్రబాబుకు ఇంటి నుంచి ప్రత్యేక ఆహారం తీసుకువచ్చేందుకు అనుమతించాలని రాజమండ్రి జైలు అధికారులకు నిర్దేశించింది. 

కాగా, చంద్రబాబు పిటిషన్ తిరస్కరణకు గురైన నేపథ్యంలో, ఆయనను అధికారులు ఏసీబీ కోర్టు నుంచి రాజమండ్రి జైలుకు తరలిస్తున్నారు. చంద్రబాబును ఆయన సొంత కాన్వాయ్ లోనే తరలిస్తున్నారు. ప్రస్తుతం విజయవాడలో భారీ వర్షం కురుస్తోంది. 

చంద్రబాబు కాన్వాయ్ రాజమండ్రి చేరుకోవడానికి రెండు గంటలకు పైగా సమయం పట్టే అవకాశాలున్నాయి. కాగా, చంద్రబాబు వెంట రాజమండ్రికి నారా లోకేశ్ కూడా వెళుతున్నట్టు  తెలుస్తోంది.

More Telugu News