Dhulipala Narendra Kumar: సజ్జల వ్యాఖ్యలకు ధూళిపాళ్ల కౌంటర్

  • చంద్రబాబుకు రిమాండ్
  • మీడియా సమావేశంలో విమర్శనాస్త్రాలు సంధించిన సజ్జల
  • కోడికత్తి కేసులో జగన్ ఎందుకు సాక్ష్యం ఇవ్వడంలేదన్న ధూళిపాళ్ల
  • జవాబుదారీతనం గురించి జగన్, సజ్జల మాట్లాడడం హాస్యాస్పదమని వెల్లడి
Dhulippala counters Sajjala remarks

చంద్రబాబుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి తీవ్ర విమర్శలు చేశారు. సజ్జల వ్యాఖ్యల పట్ల టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ కౌంటర్ ఇచ్చారు. 

"సజ్జల ఏమంటున్నాడంటే... జగన్ మోహన్ రెడ్డి రొమ్ము విరిచి నిలబడ్డాడంట. మేం అదే అడుగుతున్నాం... రొమ్ము విరిచి నిలబడిన జగన్ రెడ్డి కోడికత్తి కేసులో ఇవాళ్టి వరకు సాక్ష్యం ఇవ్వడానికి ఎందుకు ముందుకు రావడంలేదు? కోడికత్తి ఘటనలో ఎలాంటి కుట్ర లేదని ఎన్ఐఏ కూడా స్పష్టంగా చెబుతోంది. ఈ వ్యవహారంలో ఎలాంటి లబ్ది అయినా పొందింది ఎవరంటే జగన్ ఒక్కరే. 

ఆయన మీద ఈడీ కేసులున్నాయి, సీబీఐ కేసులున్నాయి. కానీ రకరకాల పిటిషన్లతో కేసులు ముందుకు జరగకుండా వాయిదాలు వేయిస్తోంది జగన్ రెడ్డి కాదా. జగన్ రెడ్డి ఛాతీ సైజు గురించి సజ్జల ఎంత చెప్పాడో తెలియదు కానీ, అంత ఛాతీ కలిగిన నాయకుడు ఆ కేసులను ఎందుకు ఎదుర్కోవడంలేదు? 

సొంత బాబాయి హత్యకు గురైతే సీబీఐ విచారణ జరుపుతోంది. మీ చేతిలో అధికారం ఉన్నా కూడా, ఇప్పటివరకు హత్య చేసింది ఎవరో తెలియని పరిస్థితులు సృష్టించారు. అందుకు మీరు కారణం కాదా?  అంతేకాదు, సజ్జల లాయర్లు, స్పెషల్ ఫ్లయిట్లు అని మాట్లాడుతున్నాడు. ఈ రాష్ట్రంలోనే కాదు, దేశంలో అందరికీ తెలుసు... తన సీబీఐ కేసులు, తన ఈడీ కేసులు వాదించే న్యాయవాదులకు ప్రభుత్వ సొమ్ము ఇచ్చే ఏకైక వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి. 

ఇక, జవాబుదారీతనం గురించి కూడా సజ్జల చాలా మాట్లాడారు. జవాబుదారీతనం గురించి జగన్ మాట్లాడినా, సజ్జల మాట్లాడినా హాస్యాస్పదంగా ఉంటుంది. జనాలు నవ్వుతారు. పోలీసులు మీ పాలేర్లా అంటున్నారు. మీ నేతలు పేర్ని నాని, సీదిరి అప్పలరాజు పోలీసులను ఎలా దూషించారో అందరూ చూశారు" అంటూ ధూళిపాళ్ల ధ్వజమెత్తారు.

More Telugu News