Manda Krishna Madiga: చంద్రబాబు అరెస్ట్ పై మంద కృష్ణ స్పందన

  • స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో చంద్రబాబు అరెస్ట్
  • చంద్రబాబును అరెస్ట్ చేసిన విధానాన్ని ఖండిస్తున్నట్టు మంద కృష్ణ ప్రకటన
  • పాలకుల ఆదేశాలతో పోలీసులు అరెస్ట్ చేసినట్టుందని వెల్లడి
  • చంద్రబాబుపై నమోదు చేసిన కేసుల జోలికి తాము వెళ్లబోవడంలేదని స్పష్టీకరణ
Manda Krsihna press meet on Chandrababu arrest

టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్ట్ చేయడంపై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ స్పందించారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన విధానాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. 

74 ఏళ్ల వయసున్న ఓ మాజీ ముఖ్యమంత్రితో పోలీసులు వ్యవహరించిన తీరు చూస్తే... వారు పాలకుల ఆదేశాల మేరకు అరెస్ట్ చేయడానికి వచ్చినట్టుగా స్పష్టమవుతోందని అన్నారు. పైనుంచి వచ్చిన ఆదేశాలతో ఏదో హడావుడిగా అరెస్ట్ చేసినట్టు తెలుస్తోందని, ఆయన వయసును, హోదాను ఏమాత్రం పట్టించుకోలేదని పేర్కొన్నారు. 

చంద్రబాబు మాజీ ముఖ్యమంత్రి అని, ఆయన సీఎంగా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలపై అరెస్ట్ చేసేటప్పుడు గవర్నర్ కు చెప్పాల్సిన అవసరం ఉందని మంద కృష్ణ అభిప్రాయపడ్డారు. ఇలాంటి ప్రాథమిక సూత్రాన్ని పోలీసులు ఉల్లంఘించారని పేర్కొన్నారు.  తనను ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలని చంద్రబాబు అడిగినప్పుడు, పోలీసులు సరైన సమాధానం చెప్పలేకపోవడం చూస్తే... ఆయన చేసిన నేరం, నేరారోపణలు కంటే ప్రభుత్వ పెద్దల నుంచి వచ్చిన ఆదేశాలను పాటించడమే శిరోధార్యం అన్నట్టుగా ఉందని విమర్శించారు. 

"చంద్రబాబుపై నమోదు చేసిన కేసుల పూర్వాపరాల జోలికి మేం వెళ్లడంలేదు. తప్పు జరిగిందా, లేదా అనేది తేల్చడానికి మేం సిద్ధంగా లేం. అది న్యాయస్థానంలో అంతిమంగా తేలాల్సిన విషయం. కానీ అరెస్ట్ చేసిన విధానం చూస్తే ఏపీ ముఖ్యమంత్రి వంటి వ్యక్తుల ఆదేశాల మేరకే అకస్మాత్తుగా తొందరపాటుతో ఈ అరెస్ట్ చేసినట్టుగా అర్థమవుతోంది. 

ఇదే పోలీసుల సాయంతో... ఏపీ పాలకులు తమ బంధువులు అరెస్ట్ కాకుండా అడ్డుకున్నారు. తన బంధువైన కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ఓ హత్య కేసులో ఉంటే... అతడి అరెస్ట్ అడ్డుకునేందుకు పోలీసులనే ముందు వరుసలో నిలిపిన విషయాన్ని గుర్తించాలి. 

చంద్రబాబుపై మోపిన అవినీతి కేసులో నేరం నిరూపణ అయితే... అవినీతి సొమ్మును తిరిగి రాబట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఒక హత్య కేసులో నేరం నిరూపణ అయినా హత్యకు గురైన వ్యక్తిని తిరిగి ప్రాణాలతో తీసుకురాగలమా? మరి ఈ రెండు కేసుల్లో దేన్ని తీవ్రంగా పరగణించాలి? 

సీఎం జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో చిన్నాన్న కుమారుడు వైఎస్ అవినాశ్ రెడ్డి 8వ నిందితుడు. ఇక్కడ అవినీతి కేసులో చంద్రబాబు ప్రథమ ముద్దాయి అని ప్రచారం చేశారు కానీ, అరెస్ట్ తర్వాత రూపొందించిన ఎఫ్ఐఆర్ లో 37వ నిందితుడిగా చూపించారు. 

వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డికి సీబీఐ పలుమార్లు నోటీసులు పంపింది. అతడు స్పందించకపోవడంతో అరెస్ట్ చేసేందుకు కర్నూలు వెళితే, వందలాది మంది కార్యకర్తలను అక్కడి ఆసుపత్రి వద్దకు రప్పించుకుని, ఇప్పుడు అరెస్ట్ చేస్తే శాంతిభద్రతల సమస్య వస్తుందని పోలీసులతో చెప్పించారు. సీబీఐ అధికారులు కర్నూలు ఎస్పీ కార్యాలయం చుట్టూ తిరిగినా, జిల్లా పోలీసులు వారికి సహకరించలేదు" అని మంద కృష్ణ వివరించారు.

More Telugu News