Moon Earthquakes: చంద్రుడిపైన భూకంపాల తీవ్రత 20 రెట్లు ఎక్కువట..!

  • భౌగోళిక నిర్మాణం వేరైనా చంద్రుడిపైనా భూకంపాలు
  • అపోలో 17 ప్రాజెక్టులో చంద్రుడిపై సిస్మోమీటర్ వదిలిన వ్యోమగాములు
  • ఐదేళ్ల పాటు పనిచేసిన సిస్మోమీటర్.. ఆ కాలంలో 12 వేల భూకంపాలు నమోదు
Will Earthquakes occur on moon Know Details

భూమిపై ఏ ప్రాంతంలోనైనా ఎప్పుడో ఒకప్పుడు భూకంపం లేదా భూ ప్రకంపనలు చోటుచేసుకోవడం సాధారణమే.. తాజాగా మొరాకోలో పెను భూకంపం సంభవించి 2 వేల మందికి పైగా చనిపోయారు. క్షతగాత్రుల సంఖ్య కూడా వేలల్లోనే ఉంటుందని అక్కడి ప్రభుత్వం చెబుతోంది. ఇటీవల భారత దేశంలోని వివిధ రాష్ట్రాల్లో స్వల్ప భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. మరి చంద్రుడిపైనా భూమి కంపిస్తుందా..? అక్కడ భూకంపం సంభవిస్తే తీవ్రత ఎలా ఉంటుందనే ప్రశ్నలకు అంతరిక్ష పరిశోధకులు చెప్పిన వివరాలు..

భూమితో పోలిస్తే చంద్రుడి భౌగోళిక నిర్మాణం ప్రత్యేకంగా ఉంటుంది.. అయినా అక్కడ తరచూ భూకంపాలు సంభిస్తుంటాయని అంతరిక్ష పరిశోధకులు చెబుతున్నారు. ఒక్కోసారి వాటి తీవ్రత భూమిపై కన్నా 20 రెట్లు ఎక్కువగా ఉంటుందని అన్నారు. ఇటీవల చంద్రుడి ఉపరితలంపై అడుగుపెట్టిన విక్రమ్ ల్యాండర్ అక్కడ భూ ప్రకంపనలకు సంబంధించిన సంకేతాలను గుర్తించిందని చెప్పారు.

గతంలో అమెరికా చేపట్టిన అపోలో 17 ప్రాజెక్టులో చంద్రుడిపైకి వెళ్లిన వ్యోమగాములు అక్కడ కొన్ని సిస్మోమీటర్లను వదిలి వచ్చారు. చంద్రుడిపై భూకంపాలకు సంబంధించిన సమాచారం సేకరించేందుకు ప్రయత్నించారు. అయితే, ఈ సిస్మోమీటర్లు కేవలం ఐదేళ్లు మాత్రమే పనిచేశాయి. ఆ ఐదేళ్ల కాలంలోనే చంద్రుడిపై సుమారు 12 వేలకు పైగా భూకంపాలు, భూ ప్రకంపనలు నమోదు చేసినట్లు నాసా వెల్లడించింది. ఈ సిస్మోమీటర్లు అందించిన సమాచారం ఆధారంగా చంద్రుడిపై నాలుగు రకాల భూకంపాలు సంభవిస్తాయని కనుగొన్నట్లు తెలిపింది.

ఆ నాలుగింటిలో ఒకటి లోతైన భూకంపం, రెండోది తేలికపాటి భూకంపం, మూడోది నిస్సార భూకంపం, నాలుగవది థర్మల్ భూకంపం.. చంద్రుడిపై అత్యంత లోతైన భూకంపాలు సాధారణమని, ఇవి ఉపరితలం నుంచి 700 కిలోమీటర్ల లోతు వరకు సంభవిస్తాయని అంతరిక్ష పరిశోధకులు చెప్పారు. చంద్రుడిపై ఉల్కలు ఢీ కొనడం, ఉపరితలంపై ఉష్ణోగ్రతలలో కలిగే మార్పులు తదితర కారణాల వల్ల భూకంపాలు సంభవిస్తాయని వివరించారు. తేలికపాటి భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.5 పాయింట్లుగా నమోదైందని, ఈ భూకంపాలు 10  సెకన్ల నుంచి 30 సెకన్లు ఉంటాయని తెలిపారు. మరికొన్ని రెండు నిమిషాల పాటు కొనసాగుతాయని వివరించారు.

More Telugu News