Bihar: మహ్మద్ ప్రవక్త పురుషోత్తముడు.. బీహార్ విద్యాశాఖ మంత్రి ప్రశంస

  • శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి వ్యాఖ్య
  • ప్రపంచంలో దైవభక్తి నెలకొల్పేందుకు భగవంతుడు మహ్మద్ ప్రవక్తను సృష్టించాడని వెల్లడి
  • అవినీతికి, దురాచరణకు ఇస్లాం వ్యతిరేకమంటూ ప్రశంసలు
  • మంత్రి వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం
  • కులం, మతం పేరిట ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపాటు
Prophet Muhammad was Maryada Purushottam says Bihar minister

ఇస్లాం మత వ్యవస్థాపకుడు మహ్మద్ ప్రవక్త పురుషోత్తముడని బీహార్ విద్యాశాఖ మంత్రి చంద్రశేఖర్ కీర్తించారు. గురువారం శ్రీకృష్ణజన్మాష్టమిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు.

‘‘అప్పట్లో ప్రపంచంలో రాక్షసత్వం ప్రబలింది. భగవంతుడిపై నమ్మకం అంతరించిపోయింది. ఎక్కడ చూసినా దుర్మార్గులు, అవినీతిపరులు ఉండేవారు. ఆ సమయంలో మధ్యప్రాచ్యంలో దేవుడు మహాపురుషుడైన మహ్మద్ ప్రవక్తను దైవభక్తిని నెలకొల్పేందుకు సృష్టించాడు. మహ్మద్ ప్రవక్త పురుషోత్తముడు’’ అని బీహార్ మంత్రి ప్రశంసించారు. విశ్వాసుల కోసం ఇస్లాం ఆవిర్భవించింది. అవినీతికి, దుర్మార్గానికి ఇస్లాం వ్యతిరేకమని కూడా ఆయన వ్యాఖ్యానించారు. 

భారత్‌లో పురుషోత్తముడిగా శ్రీరామచంద్రుడికి మాత్రమే పేరుండటంతో మంత్రి చంద్రశేఖర్ వ్యాఖ్యలు కలకలానికి దారి తీశాయి. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. మంత్రి మానసిక రుగ్మత బారినపడ్డారని, ఓసారి రామాయణంపై మరోసారి మహ్మద్ ప్రవక్తపై కామెంట్ చేస్తారని ఎద్దేవా చేసింది. ‘‘ఇటువంటి వాళ్లు మతం, కులం పేరిట ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడతారు’’ అని బీజేపీ అధికార ప్రతినిధి అర్వింద్ కుమార్ సింగ్ మండిపడ్డారు.

More Telugu News