Chandrababu: ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబు

  • ఏసీబీ కోర్టులో కొనసాగుతున్న విచారణ
  • చంద్రబాబు వాంగ్మూలం తీసుకున్న న్యాయమూర్తి
  • రాజకీయ లబ్ది కోసమే తనపై ఆరోపణలు చేస్తున్నారన్న చంద్రబాబు
  • సీఐడీ రిమాండ్ రిపోర్టు తిరస్కరించాలని కోర్టుకు విజ్ఞప్తి
Chandrababu files petition in ACB Court

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసుకు సంబంధించి విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ కొనసాగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నుంచి న్యాయమూర్తి వాంగ్మూలం తీసుకున్నారు. తన అరెస్ట్ అక్రమం అని చంద్రబాబు తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. రాజకీయ కక్షతోనే తనపై కేసు నమోదు చేశారని ఆరోపించారు. ఈ క్రమంలో చంద్రబాబు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 

రాజకీయ లబ్ది కోసమే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు. సీఐడీ రిమాండ్ రిపోర్టును తిరస్కరించాలని కోర్టును కోరారు. గవర్నర్ అనుమతి లేకుండా కేసు నమోదు చేయడం, తనను అదుపులోకి తీసుకోవడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. 

"స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నది నాటి కేబినెట్ నిర్ణయం. ప్రభుత్వ నిర్ణయాలపై క్రిమినల్ చర్యలు ఎలా తీసుకుంటారు? స్కిల్ డెవలప్ మెంట్ అంశాన్ని 2015-16 బడ్జెట్ లో పొందుపరిచాం. దానిని అసెంబ్లీ కూడా ఆమోదించింది. అసెంబ్లీ ఆమోదం తెలిపిన బడ్జెట్ ను క్రిమినల్ చర్యలతో ప్రశ్నించలేరు. 2021 డిసెంబరు 9న నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లోనూ, రిమాండ్ రిపోర్టులోనూ నా పాత్ర ఉందని పేర్కొనలేదు" అని చంద్రబాబు స్పష్టం చేశారు.

More Telugu News