dulipalla narendra: సజ్జల సిగ్గులేకుండా అబద్ధాలు చెబుతున్నారు: ధూళిపాళ్ల

  • చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను సమర్థించుకోవడానికే సజ్జల వక్రభాష్యాలని ఆగ్రహం
  • ప్రాజెక్టుతో సంబంధం లేనప్పుడు సీమెన్స్ జమాఖర్చుల్లో ఎందుకు చూపిందని ప్రశ్న
  • సీమెన్స్ సంస్థ యాజమాన్యాన్ని భయపెట్టి జగన్ సర్కార్ తప్పుడు అఫిడవిట్ తీసుకొచ్చిందని ఆరోపణ
  • ఒప్పందంతో సంబంధం లేని వ్యక్తి చెబితే చంద్రబాబు తప్పుచేసినట్టా? అని నిలదీత
Dulipall Narendra series of questions about Chandrababu arrest

స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుపై సీఎం జగన్ తరఫున పని చేసే వసూల్ రాజా సజ్జల రామకృష్ణారెడ్డి నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతున్నారని టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర మండిపడ్డారు. శనివారం ఆయన మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... 2013లో గుజరాత్‌లో ఆ ప్రాజెక్ట్ ప్రారంభమైనప్పుడు అక్కడి రాష్ట్ర ప్రభుత్వం, సీమెన్స్ ఇండస్ట్రీస్ సాఫ్ట్ వేర్ ప్రైవేట్ లిమిటెడ్, డిజైన్ టెక్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు త్రైపాక్షిక ఒప్పందం చేసుకున్నాయన్నారు. అలాగే ఝార్ఖండ్, తమిళనాడు,  తెలంగాణ ప్రభుత్వాలు కూడా అదేవిధమైన ఒప్పందాలు చేసుకున్నాయని, ఆ తర్వాతే ఏపీలో నాటి టీడీపీ ప్రభుత్వం ప్రాజెక్ట్‌ను రాష్ట్రంలో అమలు చేయడానికి సిద్ధమైందన్నారు. 

వసూల్ రాజా సజ్జల స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ అమల్లో భాగంగా అనేక రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకున్న ఒప్పందాలపై వక్రభాష్యాలు చెబుతున్నాడన్నారు. సీమెన్స్ సాఫ్ట్ వేర్ ఇండియా సాఫ్ట్ వేర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఏపీతో చేసుకున్న ఒప్పందంతో తమకు సంబంధంలేదని సజ్జల చెప్పడం హాస్యాస్పదమన్నారు. సీమెన్స్ సంస్థకు ఒప్పందంతో సంబంధం లేనప్పుడు, ఏపీ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం తాలూకు సొమ్ముని ఎందుకు సదరు సంస్థ జమా ఖర్చుల్లో చూపిందో సజ్జల చెప్పాలని నిలదీశారు. ఒప్పందం ద్వారా వచ్చిన డబ్బుని సంస్థ లాభాల్లో చూపినవారు, ఒప్పందంతో తమకు సంబంధంలేదని సదరు సంస్థ చెప్పడం వెనక ఉన్న కుట్రను అర్థం చేసుకోలేని వారెవరూ లేరని సజ్జల తెలుసుకుంటే మంచిదన్నారు.

స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ద్వారా  శిక్షణ పొందిన 2,14,000 మంది యువతను అడిగితే ప్రాజెక్ట్ కోసం కేటాయించిన రూ.370 కోట్లు ఎటు వెళ్లాయో సజ్జలకు బోధపడుతుందన్నారు. జగన్ సర్కార్ సీమెన్స్ సంస్థ యాజమాన్యాన్ని భయపెట్టి, వారి నుంచి ఒప్పందంతో తమకు సంబంధం లేదన్నట్టు రాయించి తప్పుడు అఫిడవిట్ తీసుకొచ్చిందనేది పచ్చినిజమన్నారు. సజ్జల చెబుతున్న డేటా ఎంట్రీ ఆపరేటర్ యోగేష్ గుప్తా అనే వ్యక్తి, ఏపీ ప్రభుత్వం స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌లో భాగంగా చేసుకున్న త్రైపాక్షిక ఒప్పందంలో భాగస్వామికాడని చెప్పారు. అతనికి ఒప్పందానికి ఎలాంటి సంబంధంలేదన్నారు. డేటా ఎంట్రీ ఆపరేటర్లను బెదిరించి, వారితో చంద్రబాబు పేరు చెప్పించినంత మాత్రాన టీడీపీ అధినేత తప్పుచేసినట్టు కాదన్నారు.

సీమెన్స్ ఇండియా, డిజైన్ టెక్ సంస్థ సహా, ఒప్పందానికి సంబంధించిన వివరాలు, వ్యక్తులు తనకు తెలియదని అదే యోగేశ్ గుప్తా ఈడీ విచారణలో వాంగ్మూలం ఇచ్చారన్నారు. ఈ విషయం వసూల్ రాజా సజ్జల ఎందుకు చెప్పడం లేదని నిలదీశారు. రూ.370 కోట్లు ఎటో పోయాయని చెబుతోన్న సజ్జల మాటలు అతని అజ్ఞానాన్ని, అసమర్థతను సూచిస్తున్నాయన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ కోసం టీడీపీ ప్రభుత్వం ఖర్చుపెట్టిన రూ.370 కోట్లు ఎటుపోయాయో ఈ ప్రాజెక్ట్ ద్వారా శిక్షణ పొందిన 2,14,000 మంది యువతను అడిగితే వారే సమాధానం చెబుతారన్నారు. శిక్షణార్థుల వద్దకెళ్లి చంద్రబాబు తప్పుచేశాడు.. మీరు ఆ తప్పులో భాగస్వాములని చెప్పే ధైర్యం సజ్జలకు, అతని ప్రభుత్వానికి ఉందా? అని ప్రశ్నించారు.
 
చంద్రబాబుకు చూపించని పత్రాలు, వాటిలోని సమాచారం బ్లూ మీడియా, అవినీతి మీడియాలో ఎలా వస్తుందో సజ్జల చెప్పాలన్నారు.  స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఏజెన్సీకి, ఒప్పందం చేసుకున్న నాటి టీడీపీ ప్రభుత్వానికి సంబంధం లేకపోతే, సిట్ అధిపతిగా ఉన్న రఘురామిరెడ్డి మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడానికి ఎందుకు వెళ్లాడో సజ్జల చెప్పాలన్నారు. ప్రతి కేసులో ఆయనే వెళ్తున్నాడా? రాష్ట్రవ్యాప్తంగా నమోదయ్యే కేసుల అరెస్టుల కోసం స్వయంగా డీజీపీనే వెళ్తున్నాడా? ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో కారణం చెప్పి సంబంధిత పత్రాలు చూపమని చంద్రబాబు అడిగితే, ఆయనకు ఇవ్వని పత్రాల సమాచారం జగన్‌కు వంత పాడే బ్లూమీడియాలో ఎలా వస్తోందో సజ్జల సమాధానం చెప్పాలన్నారు.

సీఐడీ, సిట్ వద్ద ఉండాల్సిన సమాచారం బ్లూమీడియా, అవినీతి మీడియాకు ఎలా వెళ్లింది? జీఎస్టీ కేసుని ఉదహరించిన సజ్జల... అదే వైసీపీ ఎంపీలు, వారికి చెందిన సంస్థలు చేసిన తప్పుడు జీఎస్టీ క్లెయిమ్స్ గురించి ఎందుకు మాట్లాడటం లేదు? అని నిలదీశారు. స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌లో భాగంగా జరిగిన ఒప్పందంలో ఉన్న కంపెనీలకు, సజ్జల చెబుతున్న జీఎస్టీ కేసుకు ఎలాంటి సంబంధం లేదు... సంబంధంలేని సంస్థలకు చెందిన జీఎస్టీ కేసుని వసూల్ రాజా అతి తెలివితో చంద్రబాబుకి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నాడన్నారు.
 
స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ అమలుపై టీడీపీ ప్రభుత్వం వేసిన కమిటీల్లోని అధికారులను ఏపీ సీఐడీ, సిట్‌లు ఎందుకు విచారించలేదో సజ్జల చెప్పాలన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ అమలు, సాధ్యాసాధ్యాలు పరిశీలించమని నాటి టీడీపీ ప్రభుత్వం కొందరు అధికారులతో రెండు కమిటీలు వేసిందని, ఆ కమిటీల్లోని అధికారులను విచారించకుండా, వారిపై చర్యలు తీసుకోకుండా కేవలం చంద్రబాబు ఒక్కడిదే తప్పని జగన్ ప్రభుత్వం ఎలా నిర్ణయిస్తుంది? చంద్రబాబు తప్పు చేశాడని వసూల్ రాజా సజ్జల ఎలా చెబుతున్నాడు? వీటికి సమాధానం చెప్పాలన్నారు.

సీఐడీ ఈ కేసులో కొన్ని సంస్థల ఆస్తులు, ఖాతాలు సీజ్ చేస్తే, హైకోర్టు సహా కింది కోర్టులు సదరు ఖాతాలు, ఆస్తులను వదిలేయాలని చెప్పింది నిజం కాదా? సుప్రీంకోర్టు కూడా కింది కోర్టుల ఆదేశాలను సమర్థించింది నిజం కాదా? అని ధ్వజమెత్తారు. సీఐడీ సీజ్ చేసిన డిజైన్ టెక్ ఖాతాల్లో దేశస్థాయిలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న మల్టీ నేషనల్ కంపెనీలు, దేశరక్షణలో భాగస్వామ్యంగా ఉన్న కంపెనీలు రకరకాల వ్యాపారాలు చేసిన సొమ్ము అని నిర్ధారణ అయ్యాకే న్యాయస్థానాలు ఖాతాల సీజ్‌ను తప్పుపట్టాయన్నారు. ఇవన్నీ తెలిసి కావాలనే సజ్జల టీడీపీపై, చంద్రబాబుపై  నిస్సిగ్గుగా బురదజల్లుడు కార్యక్రమాలు కొనసాగిస్తున్నాడన్నారు.

నోటీసు ఇస్తే సమాధానం చెప్పే విషయానికి అరెస్ట్ చేయడమా?

జగన్‌లానే చంద్రబాబు కూడా అవినీతిపరుడని సజ్జలకు అనిపించినట్లుగా ఉందని చురకలు అంటించారు. పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్టు, తప్పులు, నేరాలు ఘోరాలు చేసే సజ్జల, జగన్‌లు ఇప్పుడు చంద్రబాబు తప్పు చేశాడంటున్నారని విమర్శించారు. వసూల్ రాజా అవాస్తవాలు, అసత్యాలతో ప్రజల్ని మభ్యపెట్టడానికే మీడియా ముందుకొచ్చి తప్పుడు ప్రచారం చేశాడన్నారు. 

కేవలం ప్రజల దృష్టిని మళ్లించడానికి, చంద్రబాబు, లోకేశ్‌లకు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకనే దొంగ ప్రభుత్వం తమ పార్టీ అధినేతను అరెస్ట్ చేసిందన్నారు. ఆధారాలు అన్నీ ఉన్నప్పుడు అవి చూపించి, చంద్రబాబుకి ఒక నోటీసు ఇచ్చి ఉంటే, ఆయనే కోర్టులకు సమాధానం చెప్పుకునేవారన్నారు. కానీ అలా చేయకుండా హడావిడిగా ఆయన ఉండేచోటుకు వెళ్లి, అర్థరాత్రి అరెస్ట్ పేరుతో డ్రామాలు ఎందుకు నడిపారో సజ్జల చెప్పాలన్నారు. 

డీఐజీ రఘురామిరెడ్డి రాష్ట్ర పోలీస్ అధికారి కాదని, ముమ్మాటికీ జగన్ రెడ్డి చెంచానే అన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఏపీ ప్రభుత్వం విచారించిన సుమన్ బోస్ ఇప్పటికీ దేశంలోనే ఉన్నారని, ఆయనతోపాటు అరెస్ట్ కాబడి, వైసీపీ ప్రభుత్వ తప్పుడు కేసుల విచారణకు హాజరై, బెయిల్ పొందిన వారెవరూ దేశం విడిచి వెళ్లలేదన్నారు. జగన్, అతని ప్రభుత్వమే అలా వెళ్లారని దుష్ప్రచారం చేస్తోందని ధూళిపాళ్ల అన్నారు.

More Telugu News