Earthquake: మొరాకోలో భారీ భూకంపం...296 మంది మృత్యువాత

  • ఆఫ్రికా దేశం మొరాకోను వణికించిన భూకంపం
  • రిక్టర్ స్కేలుపై 6.8 తీవ్రత నమోదు
  • మరాకేష్ కు నైరుతి దిశగా 71 కి.మీ దూరంలో భూకంప కేంద్రం
Earthquake hits Morocco as 296 died

ఆఫ్రికా దేశం మొరాకోలో భారీ భూకంపం సంభవించింది. ఈ విపత్తు కారణంగా 296 మంది మరణించారు. రిక్టర్ స్కేలుపై ఈ భూకంపం తీవ్రత 6.8గా నమోదైంది. 19 నిమిషాల తర్వాత 4.9 తీవ్రతతో భూమి మరోసారి కంపించింది. 

స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 11 గంటల 11 నిమిషాలకు భూకంపం వచ్చినట్టు గుర్తించారు. మొరాకోలోని హై అట్లాస్ మౌంటెన్స్ ప్రాంతంలో భూమికి 18.5 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు యూఎస్ జియోలాజికల్ సర్వే (యూఎస్ జీఎస్) వెల్లడించింది. 

ప్రముఖ పర్యాటక ప్రాంతం మరాకేష్, మొరాకో దక్షిణ ప్రాంతంలో అత్యధిక సంఖ్యలో ప్రజలు మరణించినట్టు స్థానిక అధికారులు తెలిపారు. 153 మంది గాయపడ్డారని, వారిని ఆసుపత్రులకు తరలించినట్టు వెల్లడించారు. ఎక్కడ చూసినా కూలిపోయిన భవనాలు, శిథిలాలతో నిండిన వీధులు కనిపిస్తున్నాయి. 

అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. మరిన్ని ప్రకంపనలు వచ్చే అవకాశముందన్న నేపథ్యంలో చాలా ప్రాంతాల్లో ప్రజలు ఇళ్లలోకి వెళ్లకుండా రోడ్లపైనే ఉంటున్నారు.

More Telugu News