Kishan Reddy: హోంగార్డు రవీందర్ మృతిపై ప్రతిపక్ష నేతల స్పందన

  • రవీందర్ కుటుంబాన్ని ఆదుకోవాలన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి
  • ప్రభుత్వం చేసిన హత్యేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఆరోపణ
  • ముఖ్యమంత్రి కేసీఆర్ కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
Opposition Leaders Reaction On Homeguard Ravinder death

జీతం సమయానికి ఇవ్వడంలేదని ప్రశ్నించినందుకు ఉన్నతాధికారులు దూషించడంతో ఆత్మహత్యాయత్నం చేసిన హోంగార్డు రవీందర్ శుక్రవారం మరణించిన విషయం తెలిసిందే. రవీందర్ మృతిపై ఆయన కుటుంబంతో పాటు హోంగార్డులు ఆందోళన చేస్తున్నారు. రాష్ట్రంలో హోంగార్డుల అందరి పరిస్థితి దయనీయంగానే ఉందని వాపోతున్నారు. రవీందర్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, హోంగార్డు ఆత్మహత్యపై ప్రతిపక్ష నేతలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఎవరెవరు ఏమన్నారంటే..

బాధాకరం.. కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
హోంగార్డు రవీందర్ చనిపోవడం బాధాకరమని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రవీందర్ కుటుంబానికి ఆయన సంతాపం తెలిపారు. హోంగార్డు కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

హోంగార్డుల పరిస్థితి అధ్వానం: రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు
తెలంగాణలో హోంగార్డుల పరిస్థితి అధ్వానంగా మారిందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. హోంగార్డు రవీందర్ మరణం నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రవీందర్ కుటుంబాన్ని అన్నివిధాలుగా ఆదుకోవాలని, హోంగార్డుల డిమాండ్లను నెరవేర్చాలని అందులో డిమాండ్ చేశారు.

ఆ పోలీసులను తక్షణమే సస్పెండ్ చేయాలి: బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు
రవీందర్ ను వేధించిన పోలీసులను తక్షణమే సస్పెండ్ చేయాలని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. హోంగార్డు రవీందర్ మరణం అత్యంత విషాదకరమని అన్నారు. ఆయన కుటుంబానికి సంతాపం తెలిపారు.

రవీందర్ ది ప్రభుత్వ హత్యే: కూనంనేని సాంబశివరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన హోంగార్డు రవీందర్ ను ప్రభుత్వమే హత్య చేసిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. రవీందర్ కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రాష్ట్రంలోని హోంగార్డులను రెగ్యులరైజ్ చేయాలని, హోంగార్డుల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.

More Telugu News