Nara Lokesh: యువగళం వాలంటీర్లను జైలుకు పంపి రాక్షసానందం పొందుతున్నారు: నారా లోకేశ్

  • పశ్చిమ గోదావరి జిల్లాలో యువగళం పాదయాత్ర
  • నర్సాపురం, పాలకొల్లు నియోజకవర్గాల్లో లోకేశ్ పాదయాత్ర
  • సరిపల్లిలో అగ్నికుల క్షత్రియులతో ముఖాముఖి
  • జగన్ చేసిన అన్యాయంపై తిరగబడాల్సిన సమయం వచ్చిందన్న లోకేశ్
  • నాయకులను తయారు చేసే పార్టీ టీడీపీ అని ఉద్ఘాటన
Nara Lokesh held meeting with fishermen

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర నర్సాపురం, పాలకొల్లు నియోజకవర్గాల్లో కొనసాగింది. యువగళం పాదయాత్ర 207వ రోజు సీతారాంపురం క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైంది. పాదయాత్ర నర్సాపురంలోకి ప్రవేశించగానే పట్టణ ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. 

భోజన విరామానంతరం చినమామిడిపల్లి వద్ద పాలకొల్లు నియోజకవర్గంలోకి ప్రవేశించిన యువనేత లోకేశ్ ను ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు నేతృత్వంలో కొబ్బరికాయల గజమాలతో సత్కరించారు. లోకేశ్ సరిపల్లిలో అగ్నికుల క్షత్రియులతో ముఖాముఖి సమావేశమై వారి సమస్యలు తెలుసుకున్నారు. 

అధికారంలోకి వచ్చాక జీవో నెం.217 రద్దు చేస్తాం!

మత్స్యకారుల జీవనోపాధికి గొడ్డలిపోటులా పరిణమించిన జీవో నెం.217ను అధికారంలోకి వచ్చాక 100 రోజుల్లో రద్దు చేస్తాం. రిజర్వాయర్లు, చెరువులు, కాల్వల్లో చేపల వేట హక్కును మత్స్యకారులకే కల్పిస్తాం. టీడీపీ అధికారంలో ఉండగా 75 శాతం సబ్సిడీతో బోట్లు, వలలు ఇచ్చాం. జగన్ వచ్చాక అవన్నీ ఎత్తేశాడు. మేం అధికారంలోకి వచ్చాక మత్స్యకారులకు జగన్ రద్దు చేసిన పథకాలను పునరుద్ధరిస్తాం. 

కొందరు పోలీసుల వల్లే చెడ్డపేరు!

భీమవరంలో పాదయాత్రపై వైసీపీ పిల్ల సైకోలు దాడి చేసి వాలంటీర్లు, కార్యకర్తలు, నాయకులపై దాడికి తెగబడ్డారు. వైసీపీ నాయకులు మాపై అక్రమ కేసులు పెట్టి మా వాలంటీర్లను జైళ్లకు పంపి రాక్షసానందం పొందుతున్నారు. ముఖ్యమంత్రి చేస్తున్న తప్పులను ఎత్తిచూపితే... అనుచిత వ్యాఖ్యలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశామంటూ నాకు పోలీసులు నోటీసులు తెస్తున్నారు. కొంతమంది పోలీసుల వల్ల మొత్తం వ్యవస్థకే చెడ్డపేరు వస్తోంది.

ఫిష్ ఆంధ్ర పేరుతో ఫినిష్ చేశాడు!

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏపీ మత్స్యాంధ్రప్రదేశ్ గా ఉండేది. జగన్ సీఎం అయ్యాక ఏపీని ఫినిష్ ఏపీగా మార్చేశాడు. 207 రోజులుగా నేను చేస్తున్న పాదయాత్రలో జగన్ పెట్టిన ఫిష్ ఆంధ్రా పాయింట్లు మూతబడే ఉన్నాయి. 

చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు మత్స్యాకారుల కోసం రూ.1,000కోట్లు ఖర్చు పెట్టారు. సబ్సిడీ పథకాలతో పాటు పనిముట్లను కూడా అందించిన ఘనత టీడీపీది. 50 ఏళ్లు నిండిన మత్స్యకారులకు పెన్షన్లు ఇచ్చిన ఏకైక పార్టీ టీడీపీ. 

మత్స్యకారుల బిడ్డల కోసం 6 రెసిడెన్షియల్ కాలేజీలు పెట్టాం. ప్రమాదంలో మత్స్యకారులు చనిపోతే బీమా మిత్రలు వచ్చి వెంటనే మట్టి ఖర్చులకు రూ.15 వేలు ఇచ్చేవాళ్లు, మిగిలిన డబ్బులను 15 రోజుల్లో అందించిన ఘనత చంద్రబాబుది. టీడీపీని అధికారంలోకి తెచ్చే బాధ్యతను మత్స్యకారులు తీసుకోవాలి.

నాయకుల కార్ఖానా తెలుగుదేశం

నాయకులను తయారుచేసే పార్టీ టీడీపీ. అగ్నికుల క్షత్రియుల వర్గం నుంచి 2014-19 మధ్యలో ముగ్గురికి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చాం. 2019లో ఓ వ్యక్తి విశాఖలో గెలిచి పార్టీ నుండి ఫిరాయించాడు. మేం అధికారంలోకి వచ్చాక దామాషా ప్రకారం రాజకీయ అవకాశాలు ఇస్తాం. 

ఉపకులాల వారీగా ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే బీసీ సాధికర కమిటీలను ఏర్పాటు చేశాం. ఈ కమిటీలను మరింత పటిష్టం చేసి బీసీల్లోని అన్ని రంగాలకు దామాషా ప్రకారం అవకాశాలు, ఆయా కార్పొరేషన్లకు నిధులు కేటాయించి ఖర్చు చేస్తాం. 

2026 కల్లా ఫిషింగ్ హార్బర్ నిర్మిస్తాం

మత్స్యకారులను ఆర్థికంగా, రాజకీయంగా ముందుకు తీసుకెళ్తాం. ఎంబీసీ లో చేర్చే అంశాన్ని పార్టీ పెద్దలతో మాట్లాడి సానుకూల నిర్ణయాన్ని త్వరలోనే ప్రకటిస్తాం. మేం అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల్లో 2026 కల్లా నర్సాపురం సమీపంలో ఫిషింగ్ హార్బర్ ను కట్టే బాధ్యతను మేం తీసుకుంటాం. 

ఆలయ ట్రస్టు బోర్డుల్లో జరుగుతున్న అవకతవకలను సరిచేస్తాం. అగ్నికుల క్షత్రియులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటాం. వైసీపీ ప్రభుత్వం కులాల మధ్య చిచ్చుపెట్టేలా చేస్తోంది. 

త్రీమెన్ కమిటీలతో మత్స్యకారులకు న్యాయం

టీడీపీ అధికారంలో ఉండగా వేటకు వెళ్లి ప్రమాదంలో చనిపోయి, శవం గల్లంతయితే త్రీమెన్ కమిటీ ద్వారా విచారణ చేసి బాధిత కుటుంబానికి బీమా అందించేవాళ్లం. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక దీన్ని రద్దు చేశారు. మేం అధికారంలోకి వచ్చాక దీన్ని పునరుద్ధరిస్తాం. 

అగ్నికుల క్షత్రియులు తిరగబడాల్సిన సమయం వచ్చింది!

గోదావరిజిల్లాల్లో చెరువులు, కాల్వలను తలపించే రోడ్ల స్థానంలో కొత్తరోడ్లు నిర్మిస్తాం. మురికి కాల్వలు, పంట కాల్వల పూడికలు తీసి మత్స్యకారుల జీవనోపాధిని కాపాడతాం. 

అగ్నికుల క్షత్రియులంతా 2019కు ముందు, 2019 తర్వాత పరిస్థితులపై ఆలోచించాలి. కార్పొరేషన్ కు నిధులు ఇస్తున్నారా? లేదా? అనే విషయాన్ని పునరాలోచించాలి. 2019లో జగన్ మాయ మాటలకు మోసపోయి నేడు నష్టపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి అగ్నికుల క్షత్రియులకు చేసిన అన్యాయంపై తిరుగుబాటు చేయాల్సిన సమయం వచ్చింది.

*యువగళం పాదయాత్ర వివరాలు*

*ఇప్పటివరకు నడిచిన మొత్తం దూరం 2836.9 కి.మీ.*

*ఈరోజు నడిచిన దూరం 18.5 కి.మీ.*

*208వరోజు (8-9-2023) యువగళం వివరాలు*

*రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం (ఉమ్మడి తూర్పుగోదారి జిల్లా)*

సాయంత్రం

3.00 – కలగంపూడి క్యాంప్ సైట్ లో శెట్టిబలిజ సామాజికవర్గీయులతో ముఖాముఖి.

4.00 – కలగంపూడి నుంచి పాదయాత్ర ప్రారంభం.

4.45 – చించినాడలో స్థానికులతో సమావేశం.

5.45 – పాదయాత్ర రాజోలు అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశం.

6.00 – దిండిలో స్థానికులతో సమావేశం.

రాత్రి 

7.30 – శివకోటిలో రైతులతో సమావేశం.

9.00 – రాజోలు ఎన్టీఆర్ విగ్రహం వద్ద స్థానికులతో మాటామంతీ.

10.15 – సోంపల్లిలో స్థానికులతో సమావేశం.

10.30 – పొదలాడలో స్థానికులతో సమావేశం.

10.40 – పొదలాడ శుభం గ్రాండ్ వద్ద విడిది కేంద్రంలో బస.

*******

More Telugu News