Peleru: ఆటో డ్రైవర్ భార్యతో వాలంటీర్ కు సంబంధం.. అడ్డుగా ఉన్నాడని సైనేడ్ సూదులతో హత్య

  • అన్నమయ్య జిల్లా పీలేరులో వాలంటీర్ ఘాతుకం
  • కువైట్ కు వెళ్లిన ఆటో డ్రైవర్ భార్యతో సంబంధం
  • మూడు నెలల క్రితం పీలేరుకు వచ్చిన ఆటో డ్రైవర్
Volunteer murders Auto driver in Peleru

ఏపీలో కొందరు వాలంటీర్లు చేస్తున్న పనులు మొత్తం వాలంటీర్ వ్యవస్థకే మచ్చను తీసుకొస్తున్నాయి. తాజాగా అన్నమయ్య జిల్లా పీలేరులో కిశోర్ (32) అనే మరో వాలంటీర్ దారుణానికి ఒడిగట్టాడు. 35 ఏళ్ల ఆటో డ్రైవర్ ను సైనేడ్ సూదులతో పొడిచి హత్య చేశాడు. 

పూర్తి వివరాల్లోకి వెళ్తే... మూడున్నరేళ్ల క్రితం సదరు ఆటో డ్రైవర్ కువైట్ కు వెళ్లాడు. ఈ సమయంలో ఆయన భార్యతో కిశోర్ పరిచయం పెంచుకున్నాడు. మూడు నెలల క్రితం కువైట్ నుంచి ఆటో డ్రైవర్ తిరిగొచ్చాడు. పీలేరుకు వచ్చిన తర్వాత ఆయనకు భార్య, కిశోర్ విషయం తెలిపింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆయన పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. వాలంటీర్ కిశోర్ ను పిలిపించిన పోలీసులు వార్నింగ్ ఇచ్చి పంపించారు. 

దీంతో తన సాన్నిహిత్యానికి అడ్డువస్తున్న ఆమె భర్త అడ్డును తొలగించాలని కిశోర్ డిసైడ్ అయ్యాడు. తిరుపతిలో ఉన్న సునీల్, చందు, ఉమాలతో కలిసి ప్లాన్ చేశాడు. ముగ్గురుతో సైనేడ్ కొనిపించాడు. పథకం ప్రకారం ఆగస్ట్ 31న ఆటో డ్రైవర్ ను హతమార్చారు. తన కూతురుని స్కూల్ దగ్గర దింపి వెళ్తున్న సమయంలో ఆయనను ఆ ముగ్గురూ సైనేడ్ సూదులతో గుచ్చి పారిపోయారు. కాసేపటికి అతను ప్రాణాలు కోల్పోయాడు. 

భర్త మరణంతో భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. వాలంటీర్ కిశోర్ పై అనుమానం వ్యక్తం చేసింది. ఆ కోణంలో దర్యాప్తు చేసిన పోలీసులు హత్య వెనుక వాలంటీర్ హస్తం ఉందని గుర్తించారు. అతన్ని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ముగ్గురి కోసం గాలిస్తున్నారు.

More Telugu News