US President Biden: జీ20 సమావేశాలకు మాస్క్ తో హాజరుకానున్న బైడెన్

  • జిల్ బైడెన్ కు కరోనా పాజిటివ్ నేపథ్యంలో అధ్యక్షుడికి కరోనా టెస్టు
  • రెండుమార్లు జరిపిన టెస్టులో నెగెటివ్ వచ్చిందని వైద్యుల వెల్లడి
  • ముందుజాగ్రత్తగా మాస్క్ పెట్టుకుంటున్న అమెరికా ప్రెసిడెంట్
  • ఇండియా పర్యటనలో ఎలాంటి మార్పు ఉండదని వైట్ హౌస్ ప్రకటన
US President Biden To Follow CDC Guidelines During His India Visit For G20 Summit

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు వైద్యులు మరోమారు కరోనా టెస్ట్ చేశారు. బైడెన్ భార్య జిల్ బైడెన్ కు కరోనా రావడంతో ఇప్పటికే ఒకసారి ఆయనకు టెస్టు చేశారు. అందులో కరోనా నెగెటివ్ గా తేలింది. తాజాగా జరిపిన పరీక్షలోనూ అధ్యక్షుడికి కరోనా నెగెటివ్ అనే వచ్చిందని వైద్యులు చెప్పారు. దీంతో అధ్యక్షుడి ఇండియా పర్యటన షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతుందని వైట్ హౌస్ ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే, ముందుజాగ్రత్త చర్యగా ప్రెసిడెంట్ బైడెన్ మాస్క్ ధరించి జీ20 సమావేశాలకు హాజరవుతారని పేర్కొంది. గురువారం ఢిల్లీకి చేరుకోనున్న బైడెన్.. ఈ టూర్ మొత్తం పూర్తిస్థాయిలో కరోనా గైడ్ లైన్స్ పాటిస్తారని వివరించింది. ఈ ప్రకటనతో బైడెన్ ఇండియా పర్యటనపై నెలకొన్న సందేహాలకు వైట్ హౌస్ చెక్ పెట్టింది.

ఇదిలా ఉండగా ఈ నెల 7న బైడెన్ ఢిల్లీకి రానున్నారు. ఈ నెల 8న భారత ప్రధాని మోదీతో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొంటారు. ఇక 9,10 వ తేదీల్లో జరగనున్న జీ-20 దేశాధినేతల సదస్సులో పాల్గొంటారు. ఆ తర్వాత ఆయన నేరుగా వియత్నాం వెళతారు. జీ20 సదస్సుకు ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, జర్మనీ, బ్రిటన్, జపాన్ సహా వివిధ దేశాధినేతలు హాజరవుతారు. సదస్సు ముగింపు కార్యక్రమంలో జీ20 అధ్యక్ష బాధ్యతలను ప్రధాని మోదీ బ్రెజిల్ అధ్యక్షుడికి అప్పగిస్తారు.

More Telugu News