Team India: టీమిండియాను వెంటాడుతున్న వరుణుడు... వర్షం వల్ల నేపాల్ తో మ్యాచ్ నిలిపివేత

  • ఆసియా కప్ లో నేడు భారత్, నేపాల్ ఢీ
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్
  • 37.5 ఓవర్ల వద్ద వర్షం 
  • అప్పటికి 6 వికెట్లకు 178 పరుగులు చేసిన నేపాల్
  • 3 వికెట్లతో నేపాల్ ను దెబ్బతీసిన జడేజా
Rain halts play between Team India and Nepal in Asia Cup Group A match

ఆసియా కప్ లో టీమిండియాను వరుణుడు వదలడంలేదు. మొన్న పాకిస్థాన్ తో భారత్ మ్యాచ్ ను కబళించిన వాన... ఇవాళ నేపాల్ తో మ్యాచ్ లోనూ ప్రత్యక్షమైంది. భారీ వర్షం కురుస్తుండడంతో మైదానం మొత్తం కవర్లతో కప్పివేశారు. 

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకోగా, నేపాల్ బ్యాటింగ్ కు దిగింది. ఈ మ్యాచ్ కు శ్రీలంకలోని పల్లెకెలె మైదానం వేదిక. నేపాల్ 37.5 ఓవర్లలో 6 వికెట్లకు 178 పరుగుల చేసిన దశలో వర్షం రావడంతో మ్యాచ్ ఆగిపోయింది. క్రీజులో నేపాల్ బ్యాట్స్ మెన్ దీపేంద్ర సింగ్ ఐరీ (27 బ్యాటింగ్), సోంపాల్ కామీ (11 బ్యాటింగ్) ఉన్నారు. టీమిండియా బౌలర్లలో లెఫ్టార్మ్ స్పిన్నర్ రవీంద్ర జడేజా 3 వికెట్లు తీయడం విశేషం. సిరాజ్ కు 2, శార్దూల్ ఠాకూర్ కు 1 వికెట్ దక్కాయి. 

ఈ మ్యాచ్ లో నేపాల్ కు శుభారంభం లభించింది. ఓపెనర్లు ఆసిఫ్ షేక్ (58), కుశాల్ భుర్టెల్ (38) తొలి వికెట్ కు 65 పరుగులు జోడించారు. కుశాల్ ను శార్దూల్ ఠాకూర్ అవుట్ చేయడంతో ఈ భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. మిడిల్ లో జడేజా విజృంభించడంతో నేపాల్ వడివడిగా వికెట్లు చేజార్చుకుంది. అయితే, దీపేంద్ర సింగ్, సోంపాల్ వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేశారు. గుల్షన్ జా 23 పరుగులు చేశాడు.

More Telugu News