temple run: దక్షిణ భారత ఆలయ దర్శనం కోసం ఐఆర్ సీటీసీ ప్యాకేజీ.. వివరాలు ఇదిగో!

  • సౌత్ ఇండియా టెంపుల్ రన్ పేరుతో యాత్ర
  • వారం రోజుల పాటు కేరళ సమీపంలోని ఆలయాల సందర్శన
  • విమాన ప్రయాణం, బ్రేక్ ఫాస్ట్, డిన్నర్, వసతి సదుపాయాలు
south India temple run irctc tour package from Hyderabad with lowest price

కేరళ చుట్టుపక్కల ఉన్న ప్రముఖ ఆలయాల సందర్శన కోసం ఐఆర్ సీటీసీ సరికొత్త ప్యాకేజీ ప్రకటించింది. సౌత్ ఇండియా టెంపుల్ రన్ పేరుతో ప్రకటించిన ఈ టూర్ ఆరు రాత్రులు, ఏడు పగళ్లు ఉండేలా రూపొందించారు. కన్యాకుమారి, మధురై, రామేశ్వరం, తిరుచ్చి, త్రివేండ్రం తదితర ప్రాంతాల్లోని ఆలయాలను దర్శించుకోవచ్చు. ఐఆర్ సీటీసీ టూరిజం అధికారిక వెబ్ సైట్ లో ఈ టూర్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఈ ప్యాకేజీ వివరాలు..

నవంబర్ 1న హైదరాబాద్ నుంచి విమాన ప్రయాణంతో యాత్ర ప్రారంభమవుతుంది. ఆరు రోజులు, ఏడు పగళ్లు కొనసాగుతుంది. యాత్రలో భాగంగా తిరుచ్చి, త్రివేండ్రం, కన్యాకుమారి, మధురై, రామేశ్వరంలలోని ప్రముఖ దేవాలయాలను సందర్శించవచ్చు. 

ఏ రోజు ఎక్కడెక్కడ..
మొదటి రోజు: హైదరాబాద్ నుంచి ఉదయం విమానంలో బయలుదేరి త్రివేండ్రం చేరుకుంటారు. హోటల్ లో దిగి బ్రేక్ ఫాస్ట్ తర్వాత నేపియర్ మ్యూజియం సందర్శన. మధ్యాహ్నం పూవార్ ద్వీపం, సాయంత్రం అజిమల శివాలయం సందర్శన. రాత్రికి త్రివేండ్రంలో బస

రెండో రోజు: శ్రీ పద్మనాభస్వామి ఆలయ సందర్శించి కన్యాకుమారికి పయనం. అక్కడ సన్‌సెట్ పాయింట్‌ చూసి రాత్రికి కన్యాకుమారిలోనే బస చేస్తారు.

మూడో రోజు: రాక్ మెమోరియల్ ను విజిట్ చేసి రామేశ్వరం పయనం. రాత్రికి హోటల్ లో బస

నాలుగో రోజు: ఉదయం రామేశ్వరం, దనుష్కోడిలోని స్థానిక దేవాలయాల సందర్శన. రాత్రికి రామేశ్వరంలోనే బస ఏర్పాటు.

ఐదో రోజు: అబ్దుల్ కలాం మెమోరియల్‌ సందర్శన ఆ తర్వాత తంజావూరుకు పయనం. బృహదీశ్వర ఆలయం సందర్శించి అక్కడి నుంచి తిరుచ్చికి చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేస్తారు.

ఆరో రోజు: ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసి శ్రీరంగం ఆలయ సందర్శన. ఆపై మూడు గంటల ప్రయాణం తర్వాత మదురై చేరుకుంటారు. రాత్రికి మధురైలోనే బస చేస్తారు.

ఏడో రోజు: మీనాక్షి ఆలయ సందర్శన.. అనంతరం మధురై విమానాశ్రయం చేరుస్తారు. విమానంలో సాయంత్రానికి హైదరాబాద్ చేరుకుంటారు.

ప్యాకేజీ ధరలు..
హోటల్లో ప్రత్యేకంగా రూమ్ కావాలంటే ప్యాకేజీ ధర రూ.50,350 ఉంటుంది. డబుల్ షేరింగ్ రూమ్ అయితే రూ.37,650, ట్రిపుల్ షేరింగ్ ప్యాకేజీకి రూ.35,950 చెల్లించాల్సి ఉంటుంది. ఐదేళ్ల నుంచి పదకొండేళ్ల వయసున్న పిల్లలకు రూ. 31,500 (ప్రత్యేక బెడ్ తో), బెడ్ వద్దనుకుంటే రూ. 27,750 చార్జ్ చేస్తారు. రెండు నుంచి నాలుగేళ్ల పిల్లలకు రూ.20,350 చార్జ్ చేస్తారు.

ప్యాకేజీలో కవరయ్యేవి..
విమాన టికెట్లు, హోటల్ వసతి, బ్రేక్ ఫాస్ట్, డిన్నర్, అవసరమైన చోట ఏసీ వాహనాల ఏర్పాటు, టూర్ ఎస్కార్ట్ సర్వీస్

యాత్రికులు చూసుకోవాల్సినవి..
మధ్యాహ్న భోజనం, ఆలయాల్లో దర్శన టికెట్, విమానంలో ఆహారం

More Telugu News