Indigo Flight: ఢిల్లీ వెళ్తున్న ఇండిగో విమానాన్ని ఢీకొట్టిన పక్షి.. ఎమర్జెన్సీ ల్యాండింగ్‌తో తప్పిన ముప్పు

  • భువనేశ్వర్ నుంచి ఢిల్లీ వెళ్తున్న విమానం
  • మార్గమధ్యంలో పక్షి ఢీకొనడంతో సాంకేతిక లోపం
  • వెంటనే విమానాన్ని వెనక్కి తిప్పి తిరిగి భువనేశ్వర్‌లో ల్యాండ్ చేసిన పైలట్
  • 180 మంది ప్రాణాలు కాపాడాడంటూ ప్రశంసలు
Delhi bound IndiGo flight hit by bird makes emergency landing

ఢిల్లీ వెళ్తున్న ఇండిగో విమానం ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని బిజు పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండైంది. విమానంలోని 180 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్టు విమానాశ్రయ అధికారులు తెలిపారు. ఈ ఉదయం 7.50 గంటల సమయంలో ఇండిగో విమానం భువనేశ్వర్ నుంచి ఢిల్లీకి బయలుదేరింది. 20-25 నిమిషాల తర్వాత విమానాన్ని పక్షి ఢీకొనడంతో సాంకేతిక లోపం ఏర్పడింది. అప్రమత్తమైన పైలట్ వెంటనే విమానాన్ని వెనక్కి తిప్పి భువనేశ్వర్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశాడు. ఇండిగో విమానం 6ఈ-2065లో ఎడమవైపు ఇంజిన్‌లో సాంకేతిక లోపం కారణంగా విమానం తిరిగి భువనేశ్వర్‌లో ల్యాండ్ అయినట్టు ఇండిగో వర్గాలు తెలిపాయి.

విమానం ల్యాండ్ అయిన వెంటనే ప్రయాణికులను కిందికి దింపారు. వారిని మరో విమానంలో ఢిల్లీకి తరలించే అవకాశం ఉందని తెలుస్తోంది. ల్యాండ్ అయిన విమానం ఈ రోజంతా భువనేశ్వర్‌లోనే ఉండే అవకాశం ఉందని సమాచారం. ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే విమానాన్ని వెనక్కి తిప్పి సురక్షితంగా ల్యాండ్ చేసిన పైలట్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి.

More Telugu News