Daggubati Purandeswari: ఇన్ని అప్పులు ఉంటే సుపరిపాలన అని చెప్పుకుంటారా?: పురందేశ్వరి

  • ఏపీ అప్పులపై పార్లమెంటులో ప్రశ్నించిన రఘురామ
  • వివరణ ఇచ్చిన నిర్మలా సీతారామన్
  • ఏపీ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలన్న పురందేశ్వరి
  • ఏపీ అప్పు రూ.10 లక్షల కోట్లు ఉండొచ్చని వెల్లడి
Purandeswari fires on AP Govt

ఏపీ అప్పులపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు పార్లమెంటులో ప్రశ్నించగా, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నిన్న సమాధానం ఇచ్చారు. దీనిపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి స్పందించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

ఏపీ అప్పు రూ.4 లక్షల కోట్లకు పైనే అని నిర్మలా సీతారామన్ చెప్పారని, అవి కేవలం ఆర్బీఐ గణాంకాలు మాత్రమేనని, వాస్తవానికి ఏపీ అప్పు రూ.10 లక్షల కోట్ల వరకు ఉంటుందని పురందేశ్వరి స్పష్టం చేశారు. గతంలోనూ తాను ఇదే విషయాన్ని చెప్పానని అన్నారు. 

అధిక జీడీపీ అని చెప్పుకుంటూ అధిక మొత్తంలో అప్పులు తీసుకున్నారని ఆరోపణలు చేశారు. మద్యంపై వచ్చే డబ్బును చూపించి ఆదాయం పెరిగిందని పేర్కొనడం సబబు కాదని పేర్కొన్నారు. 

ఏపీలో పరిశ్రమలు రాకుండా ఆదాయం ఎలా పెరిగిందని పురందేశ్వరి ప్రశ్నించారు. ఇన్ని అప్పులు పెట్టుకుని సుపరిపాలన అంటున్నారని, సుపరిపాలన అంటూ పన్నులు వేయడం ఏంటని నిలదీశారు. అన్ని పన్నులు వేస్తున్నా అభివృద్ధి కనిపించడంలేదని విమర్శించారు.

More Telugu News