unicef: ప్రభుత్వంతో కలిసి పని చేస్తాం: జగన్‌ను కలిసిన యూనిసెఫ్ టీమ్

  • గ్రామ, వార్డు సచివాలయాలకు అనుసంధానంగా వైద్య, ఆరోగ్య రంగంలో కలిసి పని చేస్తామన్న యూనిసెఫ్ ప్రతినిధులు
  • ప్రభుత్వానికి అవసరమైన తోడ్పాటు ఇచ్చేందుకు ముందుకొచ్చిన యూనిసెఫ్
  • ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించిన జగన్, అభినందించిన ప్రతినిధులు
UNICEF team meets AP CM YS Jagan

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని యూనిసెఫ్ ఫీల్డ్ ఆఫీస్ చీఫ్ జెలాలెం బీ టఫాస్సే (ఏపీ, కర్ణాటక, తెలంగాణ) సీఎం క్యాంప్ కార్యాలయంలో కలిశారు. గ్రామ, వార్డు సచివాలయాలకు అనుసంధానంగా వైద్య, ఆరోగ్య రంగంలోని వివిధ స్థాయుల్లో ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు.

ప్రైమరీ హెల్త్‌ కేర్‌లో మిడ్ లెవల్‌ హెల్త్ ప్రొవైడర్స్(ఎంఎల్‌హెచ్‌పీలు), ఫ్యామిలీ ఫిజీషియన్, ఆశా, అంగన్వాడీ వర్కర్స్, ఏఎన్‌ఎంలు, హెల్త్ అండ్‌ వెల్నెస్ సెంటర్స్‌ వంటి వివిధ స్ధాయుల్లో ప్రభుత్వానికి అవసరమైన విధంగా తోడ్పాటు ఇచ్చేందుకు యూనిసెఫ్‌ ముందుకొచ్చింది.

వివిధ రంగాల్లో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఈ బృందంతో సీఎం జగన్ చర్చించారు. ఆరోగ్య సురక్ష పేరుతో త్వరలో ఓ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఏపీని చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ స్టేట్‌గా తీర్చిదిద్దనున్నట్లు వెల్లడించారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో ముందుకెళ్తున్న తీరును సీఎం వివరించగా, యూనిసెఫ్ యూనిసెఫ్‌ ఫీల్డ్ ఆఫీస్ చీఫ్ అభినందించారు.

చిన్నారుల ఆరోగ్యానికి సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, వారికి అందజేస్తున్న పౌష్టికాహారం, యాక్షన్‌ ప్లాన్, మహిళా రక్షణ, గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పర్యవేక్షణ, మహిళా పోలీసుల ద్వారా మహిళలు, చిన్నారులపై జరిగే అఘాయిత్యాలను అరికట్టడం వంటి కీలక అంశాలపై రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన సాయం అందిస్తామని యూనిసెఫ్ టీమ్ తెలిపింది.

ఈ సమావేశంలో యూనిసెఫ్‌ హెల్త్‌ స్పెషలిస్ట్‌ డాక్టర్‌ ఆర్పీ శ్రీధర్, యూనిసెఫ్‌ సోషల్‌ బిహేవియర్‌ చేంజ్‌ స్పెషలిస్ట్‌ సీమ, సీఎం చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, సీఎం స్పెషల్‌ సీఎస్‌ డాక్టర్‌ పూనం మాలకొండయ్య,  మహిళా, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి, మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనర్‌ జానకి పాల్గొన్నారు.

More Telugu News