Jharkhand: అసదుద్దీన్ ఓవైసీ ర్యాలీలో పాక్ అనుకూల నినాదాలు.. కేసు నమోదు

  • ఝార్ఖండ్ జేఎంఎం ఎమ్మెల్యే మృతితో డుమరీ నియోజకవర్గానికి ఈ నెల 5న ఉపఎన్నిక
  • ఎన్నికల్లో పోటీపడుతున్న ఎంఐఎం అభ్యర్థి మొబిన్ రిజ్వీ
  • రిజ్వీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మజ్లిస్ అధినేత ఓవైసీ
  • ఓవైసీ ప్రసంగం మధ్యలో ఓ యువకుడి పాకిస్థానీ అనుకూల నినాదాలు
  • ర్యాలీ ఏర్పాటు చేసిన నాయకులతో పాటూ యువకుడిపై పోలీసుల కేసు
Case filed after pro Pakistani slogans raised in Jharkhand election rally attended byasaduddin owaisi

ఝార్ఖండ్‌లో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ పాల్గొన్న ఎన్నికల ప్రచార ర్యాలీలో ఓ యువకుడు పాకిస్థాన్ అనుకూల నినాదాలు చేయడంపై తాజాగా కేసు నమోదైంది. డుమరీ నియోజకవర్గ ఎమ్మెల్యే జగర్నాత్ మహాతో (జేఎంఎం) మృతితో ఖాళీ అయిన స్థానానికి సెప్టెంబర్ 5న ఉపఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికల్లో ఎంఐఎం తరఫున అబ్దుల్ మొబిన్ రిజ్వీ పాల్గొంటున్నారు. మొబిన్‌కు మద్దతుగా గురువారం మజ్లిస్ పార్టీ నేతలు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా పాల్గొన్నారు. 

అయితే ఓవైసీ ప్రసంగిస్తున్న సమయంలో ర్యాలీకి హాజరైన ఓ యువకుడు పాకిస్థాన్ అనుకూల నినాదాలు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో, పోలీసులు యువకుడితో పాటూ మజ్లిస్ అభ్యర్థి ఎం.డీ.అబ్దుల్ మొబిన్ రిజ్వీ, ర్యాలీ నిర్వాహకుడు ముజఫర్ హసన్ నురానీ, ఇతరులపై కేసు నమోదు చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించినందుకు కేసు పెట్టారు. అయితే, వైరల్ అవుతున్న వీడియో నకిలీదని, ట్యాంపరింగ్ జరిగిందని ఝార్ఖండ్ ఎంఐఎం అధ్యక్షుడు ఎం.డి. షాకిర్ పేర్కొన్నాడు.

More Telugu News