Yuva Galam Padayatra: పనికిమాలినోడు పందిరి వేస్తే పిచ్చుక వచ్చి పడగొట్టిందంట.. జగన్‌పై లోకేశ్ పంచ్

  • చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గంలో హోరెత్తిన 199వ రోజు యువగళం పాదయాత్ర
  • జంగారెడ్డిగూడెం బోసుబొమ్మ సెంటర్‌లో జరిగిన బహిరంగసభలో యువనేత లోకేశ్ ప్రసంగం
  • జగన్ ప్రభుత్వం కట్టిన విశాఖపట్నం బస్ షెల్టర్ కూలడంపై విమర్శలు
  • బస్ షెల్టర్ సరిగా కట్టలేని వాడు మూడు రాజధానులు ఏం కడతాడంటూ ఎద్దేవా
  • పాదయాత్రలో భాగంగా లోకేశ్‌కు పలు వర్గాల వినతి పత్రాలు
  • టీడీపీ అధికారంలోకి వచ్చాక అందరి సమస్యలూ పరిష్కరిస్తామని యువనేత హామీ
Nara lokesh Yuvagalam padayatra in Chintalapudi constituency

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రకు ప్రజల్లో గొప్ప స్పందన లభిస్తోంది. 199వరోజు యువగళం పాదయాత్ర చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గంలో హోరెత్తించింది. యువనేతకు అడుగడుగునా జనం నీరాజనాలు పట్టారు. లోకేశ్‌తో సమావేశమైన పలు వర్గాలు తమ సమస్యలను ఏకరవుపెట్టాయి. 

బొర్రంపాలెం క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైన పాదయాత్ర రావికంపాడు క్రాస్ వద్ద చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. అనంతరం రావికంపాడు, దేవలపల్లి, పుట్లగట్లగూడెం, గురవాయిగూడెం, జంగారెడ్డిగూడెం ఆటోనగర్, బస్టాండు, బైపాస్ మీదుగా దండమూడి కళ్యాణ మండపం వద్దకు చేరుకుంది.
జంగారెడ్డిగూడెం బోసుబొమ్మ సెంటర్ లో జరిగిన బహిరంగసభలో యువనేత లోకేశ్ జగన్మోహన్ రెడ్డి అస్తవ్యస్త పాలనపై సింహగర్జన చేశారు. విశాఖలో బస్ షెల్టర్ కట్టడం చేతకానోడు 3రాజధానులు, పోలవరం కడతాడా అంటూ ఎద్దేవా చేశారు. లోకేశ్ ప్రసంగంలో హైలైట్స్..ఆయన మాటల్లో..

పనికిమాలినోడు పందిరి వేస్తే పిచ్చుక వచ్చి పడగొట్టింది అంట..

‘మూడు రాజధానులు కడతానన్న జగన్ ఇప్పటి వరకూ 3 ఇటుకలు పెట్టలేదు కానీ విశాఖపట్నంలో ఒక బస్ షెల్టర్ కట్టాడు. సాయంత్రం పూట చిన్న గాలికే అది కాస్తా కూలిపోయింది. బస్ షెల్టర్ కట్టడం రాని వాడు 3 రాజధానులు, పోలవరం కడతా అంటూ బిల్డప్ ఇస్తాడు. చంద్రబాబుది పోలవరం రేంజ్.. జగన్ ది మురికి కాలువ రేంజ్. జగన్ ది దరిద్ర పాదం. విశాఖలో అడుగు పెడతా అన్న ప్రతిసారి ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంది’

జగన్ కు 100 తప్పులు అయిపోయాయి!

‘ఇప్పటికే జగన్ వంద తప్పులు అయిపోయాయి. అలిపిరి టోల్ గేట్ ఛార్జ్ దగ్గర మొదలుపెట్టి శ్రీవారి సేవలు, ప్రసాదాలు, కల్యాణ మండపాలు, గెస్ట్ హౌస్‌ల వరకూ ఛార్జీలు పెంచేసి దేవుణ్ణి భక్తులకు దూరం చేశారు. తిరుమలని రాజకీయాలకు కేంద్రంగా మార్చేశాడు. టీటీడీని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేశాడు. తిరుమల కొండని బోడి గుండు అన్న భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ ఛైర్మన్. ఢిల్లీ లిక్కర్ కేసు నిందితుడు శరత్ చంద్రారెడ్డి టీటీడీ బోర్డు మెంబర్. బాబాయ్ మర్డర్ కేసులో నిందితుడు అయిన వెంకట సుబ్బారెడ్డి టీటీడీ మెంబర్’

జగన్ పై సొంత కుటుంబానికే నమ్మకం లేదు!
‘జగన్ మొన్న ఒక సభలో మాట్లాడుతూ లోకేశ్‌పై చంద్రబాబుకి నమ్మకం లేదు అని అన్నాడు. జగన్‌ని నేను సూటిగా కొన్ని ప్రశ్నలు అడగాలి అనుకుంటున్నా. జగన్.. మీ అమ్మగారు నిన్ను నమ్ముతున్నారా? ఆవిడ నీకు ఎందుకు దూరంగా ఉంటున్నారు? జగన్.. నీ చెల్లి నిన్ను నమ్ముతుందా? చెల్లి పక్క రాష్ట్రానికి ఎందుకు వెళ్ళిపోయింది? వైఎస్ బ్రతికి ఉన్నప్పుడు.. రాష్ట్రంలో అడుగుపెడితే నీ కాళ్లు విర్రగొడతా అని ఎందుకు అన్నారు? వైఎస్ కుటుంబానికి జగన్ అంటే నమ్మకం లేదు..రాష్ట్రంలో ప్రజలకి జగన్ అంటే నమ్మకం లేదు. అందరూ అంటుంది ఒక్కటే... నిన్ను నమ్మం జగన్’

అడ్డుకుంటే వైసీపీకి అంతిమయాత్రే
‘యువగళం, మనగళం, ప్రజాబలం. లోకేశ్‌ని చూస్తే జగన్‌కి భయం. జగన్ పాదయాత్ర చేసినప్పుడు మేం అడ్డుకున్నామా? అదనపు సెక్యూరిటీ ఇచ్చి పాదయాత్ర చేసుకోమన్నాం. కానీ ఇప్పుడు యువగళాన్ని అడ్డుకోమని పోలీసుల్ని పంపాడు. సాగనిస్తే పాదయాత్ర...అడ్డుకుంటే వైసీపీకి అంతిమయాత్ర’

జె-బ్రాండ్స్ తో రక్తం తాగుతున్నాడు!
‘రోజుకి క్వార్ట్రర్ తాగే వాళ్ల జేబు నుండి జగన్ జేబులోకి ఎంత వెళ్తుందో తెలుసా? క్వార్ట్రర్ పై రూ.25 రూపాయలు. అంటే.. నెలకి రూ. 750, ఏడాదికి రూ. 9 వేలు, 5 ఏళ్లకు ఎంత? రూ.45 వేలు! అంటే రోజుకి క్వార్ట్రర్ తాగే వ్యక్తి జగన్‌కు కడుతున్న జే ట్యాక్స్ రూ.45 వేలు. ప్రభుత్వానికి కట్టే ట్యాక్స్ గురించి నేను చెప్పడం లేదు. మీ రక్తం తాగుతూ జగన్ దొబ్బుతున్న సొమ్ము గురించి.. కానీ గెలిచిన తరువాత సొంత లిక్కర్ కంపెనీలు, ప్రభుత్వ మద్యం దుకాణాలు తెరిచాడు. అంత కంటే డేంజర్ ఏంటో తెలుసా జగన్ అమ్ముతున్న జే బ్రాండ్ లిక్కర్ ఒక పాయిజన్ లాంటిది. జగన్ మందు విషం కంటే ప్రమాదం’ 

మహిళలను ఆదుకునేందుకే మహాశక్తి

‘2వేల కి.మీ.ల పాదయాత్రలో మీ కష్టాలు చూశాను. కన్నీళ్లు తుడుస్తాను. భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించాం. మహాశక్తి పథకం కింద ఆడబిడ్డ నిధి:- 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.1500 అంటే ఏడాదికి రూ.18 వేలు, 5 ఏళ్లకు రూ.90 వేలు. 2) తల్లికి వందనం:- ప్రతి తల్లికి ఏడాదికి రూ.15 వేలు. ఇద్దరు ఉంటే రూ.30 వేలు. 3) దీపం పథకం:- ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం 4) ఉచిత ప్రయాణం:- మహిళలకు ఉచిత ప్రయాణం’ 

యువత భవితను దెబ్బతీశాడు
‘జగన్ యువత భవిష్యత్తుపై దెబ్బకొట్టాడు. యువత ఎప్పుడూ పేదరికంలో ఉండాలి అని జగన్ కోరుకుంటున్నాడు. జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, 2.30 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రతి ఏటా 6,500 పోలీసు ఉద్యోగాలు ఇవ్వలేదు, గ్రూప్ 2 లేదు, డీఎస్సీ లేదు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది జాబ్ నోటిఫికేషన్ ఇస్తాం. పెండింగ్ పోస్టులు అన్ని భర్తీ చేస్తాం. అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తాం’

పోలవరం పూర్తిచేసేది చంద్రబాబే!
‘టీడీపీ అధికారంలోకి రావడం ఖాయం. పోలవరం పూర్తి చేసేది చంద్రబాబు గారే. 2019లో 13 సీట్లు వైసీపీకి ఇచ్చారు. జగన్ పోలవరాన్ని పడుకోబెట్టాడు, చింతలపూడిని చంపేశాడు, పామ్ ఆయిల్ రైతుల్ని ముంచేశాడు, ఆక్వా రంగాన్ని సంక్షోభంలోకి నెట్టాడు, పోలవరం నిర్వాసితుల్ని రోడ్డున పడేశాడు, వరి రైతులకు గిట్టుబాటు లేదు. జంగారెడ్డి గూడెంలో 26 మంది కల్తీ సారా తాగి చనిపోయారు. ఏలూరులో కలుషిత నీటి వలన వందలాది మంది అనారోగ్యం పాలయ్యారు’ 

అందరి లెక్కలు సరిచేస్తా!
‘టీడీపీ కార్యకర్తలపై కేసులు పెట్టి వేధించిన ఏ ఒక్కరిని వదిలిపెట్టను. వడ్డీతో సహా చెల్లిస్తా. అందరి పేర్లు రెడ్ బుక్‌లో రాసుకుంటున్నా. అందరి లెక్కలు సరి చేస్తా. చట్టాన్ని ఉల్లంఘించి వ్యవహరించిన అధికారులపై చర్యలు తప్పవు’

చింతలపూడి నియోజకవర్గం దేవలపల్లిలో లక్కవరం గ్రామానికి చెందిన మత్స్యకారులు యుననేత లోకేశ్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. వారి సమస్యలను సావధానంగా విన్న నారా లోకేశ్ టీడీపీ అధికారంలోకి రాగానే మత్స్యకారుల జీవనోపాధికి గొడ్డలివేటుగా ఉన్న జీఓ 217ను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. జంగారెడ్డిగూడెం మండల గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్వాసిత రైతులకు చట్టప్రకారం న్యాయం చేస్తామన్నారు. రైతుల పొలాలకు నీరందించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని భరోసా ఇచ్చారు. ఆటోనగర్ లో తనను కలిసిన న్యాయవాదులతో యువనేత నారా లోకేశ్ మాట్లాడుతూ జీఓ నెం.4ను పకడ్బందీగా అమలుచేసి మృతిచెందిన న్యాయవాదుల కుటుంబాలకు అండగా నిలుస్తామని భరోసా కల్పించారు. బుట్టాయగూడెం మండల పొగాకు రైతులు యువనేత లోకేశ్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. పొగాకు రైతుల సమస్యలపై అధ్యయనం చేసి ఎరువులు, పురుగుమందులు వంటివి అందించేలా చర్యలు తీసుకుంటాం.

కాగా, యువగళం పాదయాత్ర గురువారం 200వ రోజుకు చేరుకోనుంది. ఈ సందర్భంగా 200వరోజు వేడుకలను పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు యువగళం బృందాలు సర్వసన్నద్ధమయ్యాయి. గురువారం పాదయాత్ర 2,700 కి.మీ. మైలురాయికి చేరనున్న సందర్భంగా సీతంపేటలో యువనేత లోకేశ్ పైలాన్‌ను ఆవిష్కరించనున్నారు. 

యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర వివరాలు

  • ఇప్పటివరకు నడిచిన మొత్తం దూరం 2,690 కి.మీ.
  • బుధవారం నడిచిన దూరం 20.8 కి.మీ.

200వ రోజు (31-8-2023) యువగళం వివరాలు
పోలవరం అసెంబ్లీ నియోజకవర్గం (ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా)
ఉదయం
8.00 – జంగారెడ్డిగూడెం శివారు దండమూడి కళ్యాణమండపం నుంచి పాదయాత్ర ప్రారంభం
8.05 – పాదయాత్ర పోలవరం అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశం
8.35 – నరసన్నపాలెంలో రైతులతో సమావేశం
9.05 – సీతంపేటలో స్థానికులతో మాటామంతీ
9.20 – పాదయాత్ర 2,700 కి.మీ.లకు చేరిక, సీతంపేటలో శిలాఫలకం ఆవిష్కరణ
11.20 – బయ్యనగూడెంలో స్థానికులతో సమావేశం
12.20 – కొయ్యలగూడెంలో భోజన విరామం

సాయంత్రం
4.00 – కొయ్యలగూడెంలో గిరిజనులతో ప్రత్యేక కార్యక్రమం
5.00 – కొయ్యలగూడెం నుంచి పాదయాత్ర కొనసాగింపు
5.45 – కొయ్యలగూడెం సెంటర్ లో స్థానికులతో సమావేశం
రాత్రి 
6.45 – గవరవరంలో స్థానికులతో సమావేశం
7.45 – పొంగుటూరులో స్థానికులతో సమావేశం
8.45 – పొంగుటూరు శివారు విడిది కేంద్రంలో బస

More Telugu News