India: ప్రపంచవ్యాప్తంగా ఇండియాపై సదభిప్రాయం.. మోదీపై మాత్రం మిశ్రమ స్పందన!

  • `భారత్‌పై అమెరికా థింక్ ట్యాంక్ ప్యూ రీసెర్చ సంస్థ సర్వే
  • భారత్‌పై, మోదీ నాయకత్వంపై 23 దేశాల ప్రజల అభిప్రాయ సేకరణ
  • సర్వేలో పాల్గొన్న వారిలో 46 శాతం మందిలో ఇండియాపై సానుకూల అభిప్రాయం
  • మోదీ నాయకత్వంపై మాత్రం భిన్నాభిప్రాయం
Pew Research center conducts survey on India and PM narendra Modi

వచ్చే నెల నుంచి దేశరాజధాని ఢిల్లీ వేదికగా జీ20 సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ప్రపంచ దేశాల్లో భారత్‌పైగల అభిప్రాయం తెలుసుకునేందుకు అమెరికా మేధోమధన సంస్థ ప్యూ రీసెర్చ్ సెంటర్ సర్వే నిర్వహించింది. మోదీ నాయకత్వంపై అభిప్రాయాన్ని కూడా అంచనా వేసేందుకు ప్రయత్నించింది. ఫిబ్రవరి నుంచి మే నెల మధ్య జరిగిన ఈ సర్వేలో పలు ఆసక్తికర అభిప్రాయాలు వెల్లడయ్యాయి. 23 దేశాల వారు ఈ సర్వేలో పాల్గొన్నారు. సర్వేలో పాల్గొన్న వారిలో 46 శాతం మంది భారత్ పై సానుకూల అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరో 34 శాతం మంది తమకు భారత్‌పై ప్రతికూల అభిప్రాయం ఉన్నట్టు పేర్కొన్నారు. 

ఇక దేశంలో తిరుగులేని నేతగా వెలుగొందుతున్న ప్రధాని నరేంద్ర మోదీపై 12 దేశాల్లోని ప్రజలలో భిన్నాభిప్రాయాలే వ్యక్తమయ్యాయి. తమకు మోదీ నాయకత్వంపై నమ్మకముందని 37 శాతం మంది పేర్కొనగా, 40 శాతం మంది మాత్రం పెదవి విరిచారు. 

ఈ సర్వేలో ఇజ్రాయెల్‌ లో కూడా అత్యధికులు ఇండియా పట్ల సానుకూలంగా స్పందించారు.  ఆ దేశంలోని 71 శాతం మంది మన దేశం పట్ల అనుకూలంగా స్పందించారు. ఇక కెన్యా, నైజీరియా, బ్రిటన్ దేశాల్లోని ప్రతి పది మందిలో ఆరుగురికి భారత్‌పై మంచి అభిప్రాయం ఉన్నట్టు ఈ సర్వేలో తేలింది. దక్షిణాఫ్రికా ప్రజలు మాత్రం ఇండియా విషయంలో కాస్తంత విమర్శనాత్మక వైఖరిని ప్రదర్శించారు. ఇండియాపై తమకు సదభిప్రాయం లేదని దాదాపు సగం మంది పేర్కొనడం గమనార్హం. నెదర్‌ల్యాండ్స్, స్పెయిన్ దేశాల్లో కూడా భారత్‌పై కొంత వ్యతిరేకత వ్యక్తమైంది. 

మోదీ నాయకత్వంపై కూడా దాదాపు ఇదే తరహా ఫలితాలు కనిపించాయి. జపాన్, కెన్యా, నైజీరియా దేశాల్లో ప్రజలు మోదీ నాయకత్వంపై విశ్వాసం వ్యక్తం చేశారు. కెన్యాలో మోదీ అనుకూలురు ఏకంగా 60 శాతం ఉన్నట్టు తేలింది. మరోవైపు, మెక్సికో, బ్రెజీల్ దేశాల్లో సగం మంది మోదీ నాయకత్వంపై పెదవి విరిచారు. అర్జెంటీనా, దక్షిణాఫ్రికా, దక్షిణకొరియా, అమెరికాలో కూడా మోదీ నాయకత్వంపై ఓ మోస్తరు విశ్వాసలేమి వ్యక్తమైనట్టు సర్వే తేల్చింది. 

మరోవైపు..ఐరోపా దేశాల్లో భారత్‌పై వ్యతిరేకత పెరిగినట్టు కూడా సర్వేలో తేలింది. సర్వేలో పాల్గొన్న ఐదు ఐరోపా దేశాల్లోనూ పది పర్సెంటేజీ పాయింట్ల మేర ఇండియాపై సానుకూల అభిప్రాయం తగ్గినట్టు వెల్లడైంది. ఫ్రాన్స్‌లో అత్యల్పంగా 39 శాతం మందే భారత్‌పై సానుకూల అభిప్రాయం కలిగున్నట్టు సర్వేలో తేలిసింది.  2008 నాటి సర్వేలో ఫ్రాన్స్ దేశస్తుల్లో 70 శాతం మంది భారత్‌కు అనుకూలంగా ఉన్నట్టు సర్వే గుర్తు చేసింది. అమెరికా మేధోమధన సంస్థ ఫ్యూ రీసెర్చ్ సెంటర్ నిర్వహించిన ఈ సర్వేలో మొత్తం 24 దేశాలకు చెందిన 30,861 మంది పాల్గొన్నారు.

More Telugu News