Jagityal: కోరుట్లలో కలకలం.. అనుమానాస్పద స్థితిలో అక్క మృతి, చెల్లెలు అదృశ్యం

  • కోరుట్ల పట్టణంలోని భీమునిదుబ్బలో ఘటన
  • వంటింట్లో మద్యం, కూల్‌డ్రింక్ బాటిల్స్, తినుబండారాలు
  • మరో యువకుడితో బస్టాండ్‌లో కనిపించిన చెల్లెలు
  • గాలిస్తున్న పోలీసులు
Elder sister died under suspicious circumstances younger went missing

జగిత్యాల జిల్లా కోరుట్లలో ఓ ఇంట్లో యువతి మృతి చెందగా, ఆమె చెల్లెలు అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పట్టణంలోని భీమునిదుబ్బకు చెందిన దీప్తి (24) హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. ప్రస్తుతం వర్క్ ఫ్రం హోం చేస్తోంది. ఆమె చెల్లెలు చందన బీటెక్ పూర్తిచేసి ఇంటి వద్దే ఉంటోంది. ఆమె సోదరుడు సాయి బెంగళూరులో డిగ్రీ చదువుతున్నాడు. బంధువుల గృహప్రవేశం ఉండడంతో దీప్తి తల్లిదండ్రులు శ్రీనివాస్‌రెడ్డి, మాధవి దంపతులు ఆదివారం హైదరాబాద్ వెళ్లారు. సోమవారం రాత్రి 10 గంటల సమయంలో కుమార్తెకు ఫోన్ చేసి మాట్లాడారు. మంగళవారం మధ్యాహ్నం మరోమారు  ఫోన్ చేయగా, దీప్తి ఫోన్ లిఫ్ట్ చేయలేదు. చందన ఫోన్ కూడా స్విచ్చాఫ్ చేసి ఉంది.

దీంతో అనుమానించిన వారు పొరుగింటి వారికి ఫోన్ చేసి సమాచారమిచ్చారు. ఇంటికివెళ్లి చూసిన వారు షాకయ్యారు. సోఫాలో దీప్తి మృతదేహం, వంటగదిలో రెండు మద్యం సీసాలు, కూల్‌డ్రింక్ బాటిల్, తినుబండారాల ప్యాకెట్లు కనిపించాయి. చందన జాడ లేకపోవడంతో వారు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెంటనే వారు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. చందన కనిపించకపోవడంతో అనుమానించారు. వెంటనే ఆమె కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో ఉదయం 5.12 గంటల నుంచి నాలుగైదు నిమిషాలపాటు ఓ యువకుడితో కలిసి బస్టాండ్‌లో ఉన్నట్టు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. ఆ తర్వాత నిజమాబాద్ బస్సు ఎక్కింది. దీంతో ఈ కేసు మిస్టరీగా మారింది. వారిద్దరూ దొరికితే కేసు చిక్కుముడి వీడుతుందని భావిస్తున్నారు. ఇంట్లోకి మద్యం సీసాలు ఎలా వచ్చాయి? చందన ఎందుకు పారిపోయిందనే విషయాన్ని ఆరా తీస్తున్నారు.

More Telugu News