World Cup: దాయాదుల పోరా మజాకా... గంటలోపే అమ్ముడైన భారత్-పాక్ వరల్డ్ కప్ మ్యాచ్ టికెట్లు

  • అక్టోబరు 5 నుంచి భారత్ లో వన్డే వరల్డ్ కప్
  • అక్టోబరు 14న దాయాదుల సమరం
  • భారత్-పాక్ లీగ్ మ్యాచ్ కు ఆతిథ్యమివ్వనున్న నరేంద్ర మోదీ స్టేడియం
  • సెప్టెంబరు 3న మరోసారి టికెట్లు అమ్మాలని బీసీసీఐ నిర్ణయం
India and Pakistan world cup match tickets sold within an hour

దాయాదులు భారత్, పాకిస్థాన్ మధ్య ఏ క్రీడలో పోటీ జరిగినా అది అత్యంత ఆసక్తి కలిగిస్తుంది. ఇక క్రికెట్ లో అయితే చెప్పేదేముంది... ఉత్కంఠకు కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తుంది. ఇక అసలు విషయానికొస్తే... అక్టోబరు 5 నుంచి భారత్ లో ఐసీసీ వరల్డ్ కప్ జరగనుంది. అక్టోబరు 14న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, పాక్ జట్ల మధ్య లీగ్ మ్యాచ్ జరగనుంది. 

ఈ సూపర్ మ్యాచ్ కోసం నిన్న టికెట్లను అందుబాటులోకి తీసుకురాగా, కేవలం గంటలోనే టికెట్లన్నీ అమ్ముడయ్యాయి. మంగళవారం సాయంత్రం 6 గంటలకు బుక్ మై షో ద్వారా ఆన్ లైన్ లో టికెట్ల అమ్మకాలు ప్రారంభించారు. 7 గంటల తర్వాత ఒక్క టికెట్ కూడా మిగల్లేదంటే చిరకాల ప్రత్యర్థుల పోరుకు ఎంతటి ప్రాధాన్యత ఉందో తెలుస్తుంది. 

నిర్వాహకులు ఒక్కో వ్యక్తికి రెండు టికెట్లు అమ్మారు. సెప్టెంబరు 3న మరోసారి టికెట్ల అమ్మకం ఉంటుందని బీసీసీఐ అధికారులు పేర్కొన్నారు.

More Telugu News