నారా లోకేశ్ రాటుతేలిపోయాడు: నారా భువనేశ్వరి

Nara Bhuvaneswari gets emotional while talking about Nara Lokesh padayatra
  • లోకేశ్ పాదయాత్ర తొలి నాళ్లలో కళ్ల నుంచి నీళ్లు వచ్చాయన్న భువనేశ్వరి
  • తమ కుటుంబాన్ని వైసీపీ ప్రభుత్వం చాలా ఇబ్బంది పెడుతోందని విమర్శ
  • తన తండ్రి పేరిట నాణెం విడుదల చేయడం సంతోషంగా ఉందని వ్యాఖ్య
తన కుమారుడు లోకేశ్ పాదయాత్ర గురించి మాట్లాడుతూ నారా భువనేశ్వరి భావోద్వేగానికి గురయ్యారు. లోకేశ్ పాదయాత్ర చేయాలని నిర్ణయించినప్పుడు తీవ్ర ఆవేదనకు, ఆందోళనకు గురయ్యానని ఆమె చెప్పారు. పాదయాత్ర తొలి నాళ్లలో కళ్ల నుంచి నీళ్లు ఆపుకోలేకపోయానని తెలిపారు. పాదయాత్ర ద్వారా లోకేశ్ రాటుతేలిపోయాడని అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తమ కుటుంబాన్ని ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం తమ కుటుంబం ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతోందని చెప్పారు. 

తన తండ్రి పేరిట రూ. 100 స్మారక నాణేన్ని విడుదల చేయడం సంతోషంగా ఉందని భువనేశ్వరి అన్నారు. ఈ విషయంలో అక్క పురందేశ్వరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్పారు. తన భర్త చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో ప్రస్తుతం భువనేశ్వరి పర్యటిస్తున్నారు. ఎన్టీఆర్ సంజీవిని ఉచిత వైద్యశాలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కుప్పం ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఎన్టీఆర్ సంజీవినిని ఏర్పాటు చేశామని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో కూడా వీటిని ఏర్పాటు చేస్తామని చెప్పారు. మహిళలు తలుచుకుంటే ఏమైనా చేయగలరని అన్నారు.
Go Back to Shorts
Nara Bhuvaneswari
Nara Lokesh
Chandrababu
Telugudesam
Kuppam

More Telugu News