Eluru: ఏలూరులో దారుణం.. నిర్లక్ష్యం చేస్తోందని వివాహితను చంపి ప్రియుడి ఆత్మహత్య

  • దక్షిణపువీధి అశోక్‌చక్రం ప్రాంతంలో ఘటన
  • నమ్మకంగా ఇంటికి పిలిచి గొంతుకోసి చంపేసిన వైనం
  • దొరికిపోతానన్న భయంతో రైలు కిందపడి ఆత్మహత్య
Man Killed woman and committed suicide in Eluru

వివాహేతర సంబంధం ఇద్దరి ప్రాణాలను బలిగొంది. తనను నిర్లక్ష్యం చేస్తోందన్న కారణంతో వివాహితను హత్య చేసిన ప్రియుడు ఆపై ఆత్మహత్య చేసుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఏలూరు శివారులోని శనివారపుపేటకు చెందిన ఉడతా సుజాత (30) దక్షిణపు వీధి అశోక్ చక్రం ప్రాంతంలోని ఇంట్లో హత్యకు గురైంది. అదే ఇంట్లో దిమ్మిటి సత్యనారాయణ (40) నివాసముంటున్నాడు. భార్యతో విభేదాల కారణంగా ఐదేళ్ల క్రితం ఆమెను వదిలేసి ఒక్కడే ఉంటున్నాడు. హత్యకు గురైన సుజాత నాలుగేళ్లుగా అతడితో సన్నిహితంగా ఉంటూ అప్పుడప్పుడూ వచ్చి వెళ్తుండేది.

పెయింటింగ్ పనులు చేసే సత్యనారాయణను సుజాత కొంతకాలంగా దూరం పెడుతోంది. తట్టుకోలేకపోయిన సత్యనారాయణ ఆదివారం రాత్రి తన ఇంటికొచ్చిన సుజాత పీక కోసి చంపేశాడు. ఆపై ఇంటికి తాళం వేసి వెళ్లిపోయాడు. అయితే, పోలీసులకు దొరికిపోతానన్న భయంతో నూజివీడు సమీపంలోకి చేరుకున్నాక ఓ బ్రిడ్జి కింద బైక్‌ను పార్క్ చేసి రైలు పట్టాల కింద తలపెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. 

సత్యనారాయణ ఇంట్లో లభించిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుజాత తనను దూరం పెడుతోందని, ఆమెకు తాళి కూడా కట్టానని సూసైడ్ నోట్‌లో సత్యనారాయణ పేర్కొన్నాడు. అందుకే ఆదివారం రాత్రి ఇంటికి పిలిపించుకుని చంపేశానని రాశాడు.

శనివారపుపేటకు చెందిన సుజాతకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. లారీ డ్రైవర్ అయిన ఆమె భర్త, సత్యనారాయణ స్నేహితులు. ఈ కారణంగా సుజాత, సత్యనారాయణ మధ్య పరిచయం ఏర్పడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. సుజాతకు, సత్యనారాయణకు మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు తేలిందని పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

More Telugu News