Mukesh Ambani: వినాయక చవితికి జియో ఎయిర్ ఫైబర్ లాంచ్: ముఖేశ్ అంబానీ

  • ఫైబర్ కేబుల్ అవసరం లేకుండానే జియో ఎయిర్ ఫైబర్
  • 46వ వార్షిక సాధారణ సదస్సులో ముఖేశ్ అంబానీ ప్రకటన
  • జియో యూజర్ల సంఖ్య 45 కోట్లు దాటినట్లు వెల్లడి
  • 5 కోట్ల మంది జియో వినియోగదారులు 5జీ వినియోగిస్తున్నారన్న ముఖేశ్
  • జియో సినిమా వేదికగా 45 కోట్ల మంది ఐపీఎల్ ప్రసారాలు వీక్షించారన్న రిలయన్స్ అధినేత
JioAirFiber to be launched on Ganesh Chaturthi says Mukesh Ambani

ఫైబర్ కేబుల్ అవసరం లేకుండా తీసుకు వస్తోన్న జియో ఎయిర్ ఫైబర్‌ను వినాయక చవితికి ప్రారంభించనున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముఖేశ్ అంబానీ అన్నారు. సంస్థ 46వ వార్షిక సాధారణ సదస్సులో వాటాదారులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కీలక ప్రకటనలు చేశారు. గత పదేళ్లలో కంపెనీ 150 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టినట్లు ముఖేశ్ వెల్లడించారు. ఇతర ఏ కార్పోరేట్ కంపెనీ ఈ స్థాయి పెట్టుబడులు పెట్టలేదని అన్నారు. రిలయన్స్ కొత్త తరం టెక్నాలజీ కంపెనీగా అవతరించిందన్నారు.

దేశంలో జియో యూజర్ల సంఖ్య 45 కోట్లు దాటినట్లు తెలిపారు. సగటు వినియోగం నెలకు 25 జీబీగా ఉందని తెలిపారు. 5 కోట్ల మంది జియో వినియోగదారులు 5జీ వినియోగిస్తున్నట్లు చెప్పారు. 2జీ వినియోగదారులను 4జీకి మార్చేందుకు జియో భారత్ ఫోన్‌ను కేవలం రూ.999కే తీసుకు వచ్చామన్నారు. దేశంలో అందరికీ 5జీ నెట్ వర్క్ అందించడమే లక్ష్యమని, డిసెంబర్ నాటికి అందిస్తామన్నారు. ఫైబర్ కేబుల్ అవసరంలేని జియో ఎయిర్ ఫైబర్‌ను వినాయక చవితికి లాంచ్ చేస్తున్నామని, సెప్టెంబర్ 19న దీనిని తీసుకు వస్తున్నామన్నారు.

జియో సినిమా వేదికగా 45 కోట్ల మంది ఐపీఎల్ ప్రసారాలను వీక్షించారని, ఫైనల్ మ్యాచ్‌ను 12 కోట్ల మంది చూశారన్నారు. రిలయన్స్ నికర లాభం పెరిగినట్లు తెలిపారు. బీమా రంగంలోకి ప్రవేశిస్తున్నట్లు ముఖేశ్ ప్రకటించారు. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ద్వారా సాధారణ, ఆరోగ్య బీమా సేవలను అందిస్తామన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్‌లో 2.6 లక్షల ఉద్యోగులు చేరినట్లు తెలిపారు.

More Telugu News