Nara Lokesh: ఇతర దేశాలకు కావాల్సిన మామిడి రకాలు మన వద్దే పెంచే అవకాశం ఉంది: నారా లోకేశ్

  • ఉమ్మడి కృష్ణా జిల్లాలో లోకేశ్ పాదయాత్ర
  • నూజివీడు మామిడి రైతులతో లోకేశ్ ముఖాముఖి
  • మామిడి రైతులకు పలు హామీలు
  • మామిడి బోర్డు ఏర్పాటుపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడి
  • మామిడి అమ్మకానికి మార్కెట్ లింక్ చేస్తామని హామీ 
  • పెద్ద సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని మామిడి రైతులకు లబ్ది చేకూర్చుతామన్న లోకేశ్
Lokesh held meeting with Mango farmers

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ఉమ్మడి కృష్ణా జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా లోకేశ్ నూజివీడు మామిడి రైతులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. 

లోకేశ్ మాట్లాడుతూ, టీడీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఆధునిక మామిడి పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని, రాష్ట్రంలో కొత్త మామిడి రకాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఇతర దేశాలకు కావాల్సిన మామిడి రకాలు మన వద్దే పెంచే అవకాశం ఉందని లోకేశ్ తెలిపారు. 

తాము వచ్చాక మామిడి రైతులకు తోడ్పాటు అందించేలా పల్పింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పుతామని హామీ ఇచ్చారు. నూజివీడులోని మామిడి పరిశోధన కేంద్రాన్ని బలోపేతం చేస్తామని, మామిడి జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కృషి చేస్తామని అన్నారు. 

మామిడి అమ్మకానికి మార్కెట్ ను లింక్ చేస్తామని, పెద్ద సంస్థలతో ఒప్పందం చేసుకుని రైతుకు లబ్ది చేకూరేలా చూస్తామని లోకేశ్ వివరించారు. మామిడి బోర్డు ఏర్పాటుపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.

టీడీపీ అధికారంలోకి వచ్చాక నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల విక్రయ కంపెనీలపై చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.

More Telugu News