mm srilekha: జాతీయ పురస్కారాల్లో జ్యూరీ సభ్యురాలిగా నా అభిప్రాయాన్ని బలంగా చెప్పాను: ఎంఎం శ్రీలేఖ

  • తెలుగు సినిమాకు జాతీయ అవార్డులు రావడంలో ఎంఎం శ్రీలేఖ కీలక పాత్ర
  • జ్యూరీ సభ్యురాలిగా బలంగా మాట్లాడిన మ్యూజిక్ డైరెక్టర్
  • తెలుగు సినిమాకు అవార్డు ఎందుకు ఇవ్వరని మాట్లాడగలగాలని వ్యాఖ్య
  • ఫైనల్ ప్యానల్‌లో భోజ్‌పురి వాళ్లు ఉంటారని వెల్లడి
  • వాళ్లకు తెలుగు రాదని, మహానటి సావిత్రి గురించి వాళ్లకు ఏం తెలుస్తుందని విమర్శ
mm srilekha play key role 69th national awards

భారతీయ చలన చిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే జాతీయ అవార్డులను తెలుగు సినిమా కొల్లగొట్టిన విషయం తెలిసిందే. మామూలుగా తెలుగు సినిమాలకు ఒకటీ రెండు అవార్డులు రావడమే చాలా ఎక్కువ. అలాంటిది.. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు ఏకంగా ఆరు అవార్డులు రాగా, ‘పుష్ప’కు రెండు వచ్చాయి. ఇక ఉత్తమ జాతీయ నటుడిగా అల్లు అర్జున్ నిలిచారు. దీని వెనుక సంగీత దర్శకురాలు ఎంఎం శ్రీలేఖ కీలకంగా పని చేశారు.

69వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో జ్యూరీ సభ్యురాలిగా ఎంఎం శ్రీలేఖ ఉన్నారు. తెలుగు సినిమాల ప్రత్యేకత గురించి కమిటీ సభ్యులకు వివరించారు. అవార్డుల ప్రకటన నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ.. ఓ జ్యూరీ సభ్యురాలిగా తన అభిప్రాయాన్ని తాను బలంగా చెప్పానని అన్నారు. ఈ సారి వేటికైతే అవార్డులు రావాలని అనుకున్నానో వాటికే వచ్చాయని తెలిపారు. తొలిసారి తండ్రీకొడుకులు కీరవాణి, కాలభైరవ ఒకే వేదికపై అవార్డులు తీసుకోనుండటం గొప్ప అనుభూతిని కలిగిస్తాయని అన్నారు. 

‘‘తెలుగు సినిమాలంటే కొంచెం నిర్లక్ష్యం. కంటి తుడుపుగా ఒకటో రెండో అవార్డులు ఇస్తున్నారు. దీనిపై జ్యూరీలో గట్టిగా మాట్లాడేవారు కావాలి. తెలుగుకు ఎందుకు ఇవ్వరని మాట్లాడగలగాలి. ఇదే సమయంలో సినిమాలో విషయం ఉండాలి. లేదంటే మాట్లాడలేం” అని చెప్పుకొచ్చారు. 

మామూలుగా ఫైనల్ ప్యానల్‌లో భోజ్‌పురి వాళ్లు ఉంటారని శ్రీలేఖ చెప్పారు. వాళ్లకు తెలుగు రాదని, అలాంటిప్పుడు వాళ్లకు మహానటి సావిత్రి గురించి ఏం తెలుస్తుందని అన్నారు. అందుకే జ్యూరీలో ఉన్న తెలుగువారు తెలుగు సినిమాల గురించి గట్టిగా చెప్పాలని అన్నారు. కాగా, ఈ జ్యురీలో మరో తెలుగు వ్యక్తి, ప్రముఖ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి కూడా సభ్యురాలిగా వున్నారు.   

More Telugu News