Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ పై విదేశీ మీడియా స్పందన

  • నిన్న భారతదేశ అంతరిక్ష చరిత్రలో నిలిచిపోయే ఘట్టం
  • చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండైన చంద్రయాన్-3
  • ఈ ఘనత సాధించిన తొలి దేశంగా ఖ్యాతి పొందిన భారత్
  • భారత్ ను అభినందించిన విదేశీ మీడియా సంస్థలు
  • అదే సమయంలో కొంత విమర్శనాత్మకంగానూ స్పందించిన వైనం
Foreign media responses on Chandrayaan 3 success

ఇంతవరకు ఏ దేశానికి సాధ్యం కాని చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండింగ్ ను భారత్ సాధించడం చరిత్రలో నిలిచిపోయే ఘట్టం. ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3లోని విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా ప్రజ్ఞాన్ రోవర్ ను జాబిల్లి ఉపరితలంపైకి జాగ్రత్తగా దించింది. తద్వారా చంద్రుడి దక్షిణ ధృవంపై కాలుమోపిన తొలి దేశంగా భారత్ రికార్డు స్థాపించింది. 

ఇటీవలే చంద్రుడి దక్షిణ ధృవంపై దిగే ప్రయత్నంలో రష్యాకు చెందిన లూనా-25 కుప్పకూలిపోగా, అదే చోట భారత్ విజయం సాధించడంతో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇస్రో సాధించిన ఈ ఘనతను ప్రపంచవ్యాప్తంగా కొనియాడుతున్నారు. ఇప్పటివరకు భారత్ కు మాత్రమే సాధ్యమైన ఈ కీలక ఘట్టంపై విదేశీ మీడియా విశేషంగా స్పందించింది. 

ప్రపంచ ప్రఖ్యాత మీడియా సంస్థ బీబీసీ... చారిత్రాత్మక మూన్ ల్యాండింగ్ అంటూ శీర్షికతో కథనాన్ని ప్రచురించింది. ల్యాండింగ్ ప్రక్రియను బీబీసీ చానల్లోనూ దీనిపై లైవ్ స్ట్రీమింగ్ ఇచ్చారు.

అమెరికాకు చెందిన ప్రముఖ మీడియా సంస్థ ది వాషింగ్టన్ పోస్ట్ కూడా చంద్రయాన్-3 ప్రయోగ సాఫల్యంపై స్పందించింది. అంతరిక్ష లక్ష్యాలను పెంచుకుంటూ పోతున్న దేశానికి అద్భుత విజయం అంటూ శీర్షికతో భారత్ ను ప్రశంసించింది. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ఇస్రో అంతరిక్ష కార్యక్రమాలు కూడా ఎంతో ఉపయోగపడుతున్నాయి... ప్రపంచవేదికపై భారత ప్రతిష్ఠకు ప్రతీక అంటూ ఇస్రోను ప్రధాని మోదీ కీర్తిస్తుండడంలో ఆశ్చర్యమేమీ లేదు అని వివరించింది.

బ్రిటన్ కు చెందిన అగ్రగామి మీడియా సంస్థ ది గార్డియన్ చంద్రయాన్-3పై స్పందిస్తూ... అంతరిక్ష శక్తిగా అవతరించిన భారత్ అంటూ కథనం వెలువరించింది. మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం భారత్ ను సాంకేతికపరంగా, అంతరిక్ష పరిశోధన రంగంలో శక్తిమంతమైనదిగా అగ్రస్థానంలో నిలిపేందుకు ఎంతో ఆరాటపడుతోందని పేర్కొంది. చంద్రయాన్-3 సక్సెస్ కారణంగా అగ్రరాజ్యాల్లో ఇప్పుడు మోదీకి విశిష్ట స్థానం తథ్యమని, వచ్చే ఎన్నికల్లో ఆయనకు ఈ విజయం ఎంతో లబ్ది చేకూర్చనుందని ది గార్డియన్ అభిప్రాయపడింది. 

ఇక, అనుకున్న లక్ష్యం సాధించిన భారత్ ఇప్పుడు దౌత్యపరంగానూ ఎంతో ఉన్నతస్థాయికి చేరినట్టు భావించాలని అమెరికా ప్రఖ్యాత మీడియా సంస్థ ది న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. శాస్త్ర విజ్ఞాన రంగాల్లో భారత్ కు లోతైన మూలాలు ఉన్నాయని వెల్లడించింది. ఇదే సమయంలో న్యూయార్క్ టైమ్స్ కాస్త విమర్శనాత్మకంగానూ వ్యాఖ్యానించింది. మోదీ నాయకత్వంలో హిందూ జాతీయవాద పార్టీ కారణంగా విభజన రాజకీయాలు నెలకొన్న సమయంలో ఈ ఘట్టం దేశ ప్రజల ఐక్యతకు సంబంధించి అరుదైన క్షణాలను ఆవిష్కరించిందని వివరించింది. 

ఆస్ట్రేలియాకు చెందిన ఏబీసీ మీడియా చంద్రయాన్-3 ఘట్టాన్ని మోదీ ప్రభుత్వానికి దక్కిన విజయంగా అభివర్ణించింది. ఈ ఘట్టం భారత్ ను ప్రపంచ సూపర్ పవర్ గా, టెక్నాలజీ దిగ్గజంగా నిలిపింది అని పేర్కొంది. అయితే, ఇలాంటి విజయాలు సాధిస్తున్న భారత్ లో ఇప్పటికీ కోట్లాది మంది జీవితాలు దారిద్ర్యంలో ఉన్నాయని విమర్శకులు అంటున్నారని తన కథనంలో వెల్లడించింది.

More Telugu News