Chandrayaan-3: మరి కాసేపట్లో ల్యాండర్ నుంచి బయటకు రానున్న రోవర్: ఇస్రో చైర్మన్

  • జాబిల్లిపై ఉన్న విక్రమ్ ల్యాండర్‌ స్థితిగతులను పరీక్షిస్తున్న ఇస్రో
  • తదనంతరం ల్యాండర్‌లోని రోవర్ బయటకు వస్తుందన్న ఇస్రో చైర్మన్
  • తదుపరి 14 రోజుల పాటు ల్యాండర్, రోవర్‌పై ఉన్న పరికరాలు పలు ప్రయోగాలు నిర్వహిస్తాయని వెల్లడి 
Rover to soon come out of lander says Isro Chief

చంద్రయాన్-3 విజయంతో అంతరిక్ష పరిశోధన రంగంలో ఇస్రో ప్రపంచశక్తిగా నిలిచింది. భారత అంతరిక్ష పరిశోధనకు ఓ కొత్త దశ, దిశ ఒనగూడింది. కాగా, విక్రమ్ ల్యాండర్‌ను దిగ్విజయంగా చంద్రుడిపై చేర్చిన ఇస్రో తదుపరి చర్యలకు పూనుకుంది. చంద్రుడిపై ఉన్న విక్రమ్ ల్యాండర్ స్థితిగతులను పరిశీలించడంతో పాటూ ల్యాండర్‌లోని రోవర్‌ను జాబిల్లి ఉపరితలంపై దించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మరికొన్ని గంటల్లో రోవర్ బయటకు వస్తుందని ఇస్రో చీఫ్ ఎస్. సోమ్‌నాథ్ తాజాగా పేర్కొన్నారు. 

‘‘చంద్రయాన్-3కి సంబంధించి అత్యంత క్లిష్టమైన దశలు విజయవంతంగా పూర్తయ్యాయి. మరి కొన్ని గంటల పాటు ల్యాండర్ పనితీరును పరిశీలిస్తాం. ఆ తరువాత ల్యాండర్ నుంచి రోవర్ బయటకు వస్తుంది. వచ్చే 14 రోజుల పాటు ల్యాండర్, రోవర్‌పై ఉన్న పరికరాలు అనేక ప్రయోగాలు చేపడతాయి. రాబోయే రోజులు అత్యంత ఎగ్జైటింగ్‌గా ఉండబోతున్నాయి’’ అని పేర్కొన్నారు.

More Telugu News