BJP: కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు కవిత కౌంటర్

  • పార్లమెంట్ లో మహిళల ప్రాతినిధ్యం ఎందుకు పెంచట్లేదన్న కవిత 
  • మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించడంలేదని బీజేపీపై విమర్శలు
  • బీఆర్ఎస్ జాబితాతో బీజేపీ నేతల్లో ఆందోళన మొదలైందని ఎద్దేవా
BRS Mlc Kavitha counter to BJP telangana Chief Kishan Reddy

బీఆర్ఎస్ పార్టీ టికెట్ కేటాయింపులపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. కిషన్ రెడ్డికి కౌంటర్ ఇస్తూ.. బీఆర్ఎస్ అభ్యర్థుల లిస్ట్ చూసి బీజేపీ ఆందోళన పడుతోందని అన్నారు. బీజేపీ నేతల ఆందోళన తమకు అర్థమవుతోందని, వారి రాజకీయ అభద్రతను మహిళా ప్రాధాన్యంతో ముడిపెట్టవద్దని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మహిళలకు ఎన్ని సీట్లు ఇస్తాయో వేచి చూద్దామని చెప్పారు. పార్లమెంట్ లో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే సూచించిన విషయాన్ని కవిత గుర్తుచేశారు.

మహిళా రిజర్వేషన్లపై బీజేపీకే క్లారిటీ లేదని విమర్శించారు. ఈ బిల్లుకు సంబంధించి మహిళలను బీజేపీ రెండుసార్లు మోసం చేసిందని ఆరోపించారు. ఉభయ సభలలో ఎన్డీయే కూటమికి మెజారిటీ ఉన్నప్పటికీ మహిళా బిల్లును ఎందుకు ఆమోదించడంలేదని కవిత ప్రశ్నించారు. స్థానిక సంస్థల్లో 14 లక్షల మంది మహిళలకు ప్రాతినిధ్యం లభించిందని పేర్కొన్నారు. కాగా, బీఆర్ఎస్ తొలి జాబితాలో మహిళలకు చోటేదంటూ కిషన్ రెడ్డి సోమవారం విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. మహిళల రిజర్వేషన్ల కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దొంగ దీక్షలు చేశారంటూ ఎమ్మెల్సీ కవితపై పరోక్షంగా సెటైర్లు వేశారు. కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కవిత మంగళవారం మండిపడ్డారు.

More Telugu News