Bandi Sanjay: డీకే అరుణ అరెస్ట్ పై తీవ్రంగా స్పందించిన బండి సంజయ్

  • నిర్మల్ మాస్టర్ ప్లాన్ ను వ్యతిరేకిస్తున్న బీజేపీ
  • దీక్ష చేపట్టిన బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి
  • సంఘీభావం తెలిపేందుకు బయల్దేరిన డీకే అరుణ
  • మార్గమధ్యంలోనే అడ్డుకుని పీఎస్ కు తరలించిన పోలీసులు
Bandi Sanjay reacts to DK Aruna arrest

నిర్మల్ మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆమరణ దీక్ష చేపట్టిన నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మహేశ్వర్ రెడ్డికి మద్దతు తెలపడానికి వెళుతున్న బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణను పోలీసులు మార్గమధ్యంలోనే అడ్డుకున్నారు. 

దీనిపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ మండిపడ్డారు. డీకే అరుణ అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. నిర్మల్ మాస్టర్ ప్లాన్ పై దీక్ష చేస్తున్న మహేశ్వర్ రెడ్డికి సంఘీభావం తెలిపేందుకు వెళుతున్న డీకే అరుణను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడం దుర్మార్గం అని పేర్కొన్నారు. 

కేసీఆర్ నియంత పోకడలను ప్రజలు గమనిస్తున్నారని, త్వరలోనే కేసీఆర్ ప్రభుత్వానికి కర్రు కాల్చి వాతపెట్టడం ఖాయమని బండి సంజయ్ స్పష్టం చేశారు. 

"తెలంగాణ వ్యాప్తంగా లక్షలాది పేదలు సొంత ఇళ్లు లేక అల్లాడిపోతున్నారు. కిరాయి కట్టలేక కొందరు, నిలువ నీడలేక మరికొందరు ఇబ్బందిపడుతున్నా కేసీఆర్ పట్టించుకోవడంలేదు. కేసీఆర్ ది నీతిలేని ప్రభుత్వం. వెంటనే డబుల్ బెడ్రూం లబ్దిదారుల జాబితాను వెల్లడి చేయాలి. మోదీ ప్రభుత్వం మంజూరు చేసిన 2.5 లక్షల ఇళ్ల సంగతి ఏమైందో చెప్పాలి" అని బండి సంజయ్ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

More Telugu News