Rahul Gandhi: రాహుల్ గాంధీకి థ్యాంక్స్ చెప్పిన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు.. ఎందుకో ఈ వీడియో చూడండి!

  • లడఖ్ కు బైక్ టూర్ చేపట్టిన కాంగ్రెస్ నేత.. ఫోటోలు వైరల్
  • కాంగ్రెస్ పాలనలో కచ్చా రోడ్లు.. మోదీ పాలనలో అద్భుతమైన రహదారులు
  • పాత, కొత్త వీడియోలతో కేంద్రమంత్రి ట్వీట్
Union Minister Kiren Rijiju says Thanks To Rahul Gandhi Ladakh Trip

కాంగ్రెస్ పాలనలో అధ్వాన్నమైన రోడ్లను మోదీ సర్కారు అద్భుతమైన రోడ్లుగా తీర్చిదిద్దిందని, ఇప్పుడు అదే రహదారులపై రాహుల్ గాంధీ బైక్ రైడ్ చేస్తున్నారని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు. మోదీ సర్కారు నిర్మించిన అద్భుతమైన రహదారులను ప్రోత్సహించినందుకు థ్యాంక్స్ అంటూ కిరణ్ రిజిజు ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పాలనలో రోడ్ల పరిస్థితిని, ఇప్పుడు లడఖ్ లోని రహదారుల పరిస్థితిని చూపించే వీడియోలను ట్విట్టర్ లో పెట్టారు. 

కాంగ్రెస్ ఎంపీ, పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ లడఖ్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. తన తండ్రి జయంతి సందర్భంగా రాహుల్ గాంధీ లడఖ్ కు బైక్ రైడ్ చేపట్టారు. ఆదివారం ఉదయం పాంగాంగ్ సరస్సు వద్ద తన తండ్రి రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. దీంతో పాటు పార్టీ కార్యక్రమాల కోసం లడఖ్ లో రెండు రోజులు పర్యటిస్తానని ఆయన తొలుత వెల్లడించారు. తాజాగా తన పర్యటనను ఆరు రోజులకు పొడిగించుకున్నారు.

తన పర్యటనకు సంబంధించిన బైక్ రైడ్ ఫొటోలను రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి కాస్తా వైరల్ గా మారాయి. ఈ ఫొటోలను బీజేపీ నేతలు రీట్వీట్ చేస్తూ కాంగ్రెస్ పాలనలో అధ్వాన్నంగా ఉన్న రోడ్లను మోదీ సర్కారు అద్భుతంగా తీర్చిదిద్దిందని, ఆ రోడ్లపైనే రాహుల్ గాంధీ ఇప్పుడు బైక్ పై దూసుకెళ్లారని పేర్కొంది. మోదీ సర్కారు నిర్మించిన రోడ్లను ప్రోత్సహించినందుకు రాహుల్ గాంధీకి ధన్యవాదాలు కూడా చెబుతున్నానన్నారు.

More Telugu News