Botsa Satyanarayana: తనకు టీడీపీ పాలనే నచ్చిందన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై మంత్రి బొత్స స్పందన

  • వైసీపీ పాలన కంటే టీడీపీ పాలన భేష్ అంటూ పవన్ వ్యాఖ్యలు
  • సెలెబ్రిటీ అంటూ పవన్ పై ధ్వజమెత్తిన బొత్స
  • పచ్చకామెర్ల వాళ్లకు లోకమంతా పచ్చగానే కనిపిస్తుందని వ్యాఖ్యలు
  • ఉగాది తర్వాత సెలెబ్రిటీ పరిస్థితి క్లోజ్ అని వెల్లడి
  • అరుపులు, కేకలు ఈ ఆర్నెల్లేనని వ్యంగ్యం
Botsa reacts to Pawan Kalyan comments

వైసీపీ పాలనతో పోల్చితే తనకు టీడీపీ పాలనే నచ్చిందని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పేర్కొనడంపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. ఓ సెలెబ్రిటీ రాష్ట్రమంతా తిరుగుతూ మా సీఎంపై అసహనం ప్రదర్శిస్తున్నారు అంటూ పవన్ పై పరోక్ష విమర్శలు చేశారు. ఆ సెలెబ్రిటీకి టీడీపీ పాలన నచ్చిందట... పచ్చకామెర్ల వాళ్లకు లోకమంతా పచ్చగానే కనిపిస్తుందన్నది మరోసారి నిరూపితమైంది అని ఎద్దేవా చేశారు. 

"టీడీపీ హయాంలో దోపిడీ, పెత్తందారీ వ్యవస్థ ఆ సెలెబ్రిటీకి కనిపించలేదా? రుషికొండలో జరుగుతోంది ప్రభుత్వ భవనాల నిర్మాణం... పైగా ఆ నిర్మాణాలు ప్రభుత్వ భూముల్లోనే జరుగుతున్నాయి... నీకెందుకు నొప్పి? అందుకే ప్రజలు నిన్ను ఆమోదించడంలేదు" అని బొత్స వ్యాఖ్యానించారు. 

వైసీపీ సర్కారును గద్దె దించాలని సెలెబ్రిటీ అంటున్నారని... ఎందుకు గద్దె దించాలని అంటున్నారో, దాని వెనుక ఉన్న ప్రణాళికలు ఏంటో కూడా ఆ సెలెబ్రిటీ చెబితే బాగుంటుందని బొత్స అన్నారు. ఉగాది తర్వాత సెలెబ్రిటీ పరిస్థితి ముగుస్తుందని, ఈ ఆర్నెల్లు వినిపించే అరుపులు, కేకలు ఆ తర్వాత ఉండవని వ్యంగ్యం ప్రదర్శించారు.

More Telugu News