Etela Rajender: బీఆర్ఎస్‌కు సినిమా అయినా.. ట్రయల్ అయినా చూపించేది వారే!: ఈటల రాజేందర్

  • వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ప్రజలు సినిమా చూపిస్తారని వ్యాఖ్య
  • అందుకు బీఆర్ఎస్ నేతలు సిద్ధంగా ఉండాలన్న ఈటల
  • గిరిజన మహిళపై పోలీసులు దాడి చేస్తే కేసీఆర్ స్పందించలేదని ఆగ్రహం
Etala Rajender on KTR comments on opposition

వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ప్రజలే సినిమా చూపిస్తారని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. సినిమా అయినా, ట్రయల్ అయినా అది ప్రజలే చూపిస్తారని, నాయకులు కాదని అన్నారు. సినిమా చూపించేది ప్రజలైతే, చూడాల్సింది బీఆర్ఎస్ నాయకులు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాబోయే ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్‌కు సినిమా చూపించబోతున్నారన్నారు. అందుకు బీఆర్ఎస్ నేతలు సిద్ధంగా ఉండాలని ఎద్దేవా చేశారు. అంతకుముందు మంత్రి కేటీఆర్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ... ప్రతిపక్షాలకు 2023 చివరలో మళ్లీ సినిమా చూపిస్తామని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ఈటల పైవిధంగా స్పందించారు. 

ఈటల ఇంకా మాట్లాడుతూ... భాగ్యనగరంలో స్వాతంత్ర్య దినోత్సవం రోజున గిరిజన మహిళపై పోలీసులు దాడి చేస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించలేదని మండిపడ్డారు. ఈ అంశానికి సంబంధించి ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారన్నారు. బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని, బాధితురాలికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గజ్వేల్ నియోజకవర్గంలో దళిత బస్తీలో జనాలను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

More Telugu News