Vijay Sai Reddy: రాఖీలకు తాంత్రిక పూజలు చేసి పంపిస్తారా ఏమిటి... బాబుగారూ?: విజయసాయిరెడ్డి సెటైర్

  • చంద్రబాబు కొత్తగా బాబా అవతారం ఎత్తారన్న విజయసాయిరెడ్డి
  • తనకు చెప్పుకుంటే దేవుడికి చెప్పుకున్నట్లే అంటున్నారని ఎద్దేవా
  • ఏపీ ప్రభుత్వానికి భక్తుల భద్రతే తొలి ప్రాధాన్యత అని వెల్లడి  
Vijayasai Reddy satire on Chandrababu Naidu

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి సెటైర్లు వేశారు. తాను రాఖీ పంపిస్తున్నానని, 45 రోజులు పూజగదిలో ఉంచి పూజ చేసి, మీ చేతికి కట్టుకోండని, ఆ తర్వాత తనను తలుచుకోండని, అప్పుడు ఏ కష్టాలు వచ్చినా వాటిని భగవంతుడు తీరుస్తాడని.. ఆ భగవంతుడి సంకల్పానికి తాను అండగా ఉంటానని ఇటీవల బహిరంగ సభలో చంద్రబాబు అన్నారు. ఈ వ్యాఖ్యలపై విజయసాయిరెడ్డి ఎక్స్ (ట్విట్టర్) ద్వారా సెటైరికల్ ట్వీట్ చేశారు.

భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ బత్తి అనేది వ్యాపార ప్రకటన మాత్రమేనని, కానీ కొత్తగా బాబా అవతారం ఎత్తిన చంద్రబాబు గారు కూడా ప్రజలు తమ బాధలు తనకు చెప్పుకుంటే దేవుడికి విన్నవించుకున్నట్టే అని సంకల్పాల గురించి మాట్లాడుతున్నాడని,  అయితే ప్రజల మీద కోపంతో రాఖీలకు తాంత్రిక పూజలు చేసి పంపిస్తారా ఏమిటి... బాబుగారూ? అని ట్వీట్ చేశారు.

తిరుమలలో టీటీడీ భక్తుల భద్రత కోసం అన్ని చర్యలు తీసుకుంటోందని విజయసాయిరెడ్డి మరో ట్వీట్ చేశారు. సీసీటీవీ ఇన్‌స్టాలేషన్, భక్తులకు అవగాహన కలిగించడం వంటి కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. టీటీడీకి, ఏపీ ప్రభుత్వానికి భక్తుల భద్రతే తొలి ప్రాధాన్యత అని, అందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.

More Telugu News