Andhra Pradesh: వైసీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుంది: ధూళిపాళ్ల నరేంద్ర

  • అందుకే అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శలు
  • పంచాయతీ ఉప ఎన్నికలపై టీడీపీ సీనియర్ నేత ఆరోపణ
  • అధికార పార్టీ అక్రమాలకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారని ఫైర్
TDP Leader Dhulipalla Narendra Response on veerammakunta violence

ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పంచాయతీ ఉప ఎన్నికల్లో ఓటమి తప్పదని వైసీపీ నేతలకు అర్థమైందని, అందుకే అక్రమాలకు పాల్పడుతున్నారని టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. అధికార పార్టీ అక్రమాలు, దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతుంటే పోలీసులు చర్యలు తీసుకోవడంలేదని విమర్శించారు. అధికార పార్టీ నేతలకు వత్తాసు పలుకుతున్నారంటూ పోలీసులపై నరేంద్ర మండిపడ్డారు. ఎన్నికల సందర్భంగా అధికార, ప్రతిపక్షాలకు వేర్వేరు నిబంధనలు పెట్టారా అంటూ పోలీసులను నరేంద్ర నిలదీశారు.

దెందులూరు నియోజకవర్గం వీరమ్మకుంటలో టీడీపీ కార్యకర్తలపై దాడులను ఆయన ఖండించారు. ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి అండతో వైసీపీ కార్యకర్తలు ఈ దాడులకు తెగబడ్డారని ఆరోపించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి దెందులూరు నుంచి పారిపోతారని జోస్యం చెప్పారు. వీరమ్మకుంటలో దాడులకు తెగబడిన వారిపై కేసులు నమోదు చేయాలంటూ ఎన్నికల అధికారులు, పోలీసులను ధూళిపాళ్ల నరేంద్ర డిమాండ్ చేశారు.

More Telugu News