Chandrababu: తెలుగు మహిళలు ప్రపంచానికే ఆదర్శంగా నిలవాలన్నదే నా ఆలోచన: చంద్రబాబు

  • కోనసీమ జిల్లాలో చంద్రబాబు పర్యటన
  • అమలాపురంలో మహిళల ప్రగతి కోసం ప్రజావేదిక కార్యక్రమం
  • మహిళలను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగం
Chandrababu held neeting with women in Amalapuram

కోనసీమ జిల్లా అమలాపురంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మహిళల ప్రగతి కోసం ప్రజావేదిక పేరిట 'భవిష్యత్ కు గ్యారెంటీ' సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ, మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడి, వారిని అన్నిరంగాల్లో ముందు నిలిపిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని తెలిపారు. 

ఆడబిడ్డల్ని మగవాళ్లతో సమానంగా నిలపాలని ఆలోచించిన మొట్టమొదటి నాయకుడు స్వర్గీయ ఎన్టీఆర్ అని వెల్లడించారు. ఆస్తిలో సమానహక్కు కల్పించడంతో పాటు, చదువులో కూడా ఆడబిడ్డలు ముందుండేలా చేసిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని కీర్తించారు. 

మహిళలకు రాజకీయాల్లో ప్రాధాన్యత కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుందని తెలిపారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 9 శాతం రిజర్వేషన్లు ఇచ్చాడు... ఆయనిచ్చిన రిజర్వేషన్లు నేడు 50 శాతానికి చేరాయి అని వెల్లడించారు.


చంద్రబాబు ప్రసంగం ముఖ్యాంశాలు

 • ఉద్యోగాల్లో, రాజకీయాల్లో మహిళల్ని ముందుకు నడిపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. డ్వాక్రా సంఘాలతో తెలుగు మహిళల్ని ఆర్థికంగా బలోపేతం చేసేలా నిర్ణయాలు తీసుకున్నాను. తెలివితేటలతో పనిచేయడంలో మహిళలే ముందున్నారు. బ్లడ్ సర్క్యులేషన్ ఆడవాళ్లకు కుడివైపు ఉంటే, మగాళ్లకు ఎడమవైపు ఉంటుంది. అది కూడా మహిళల ఎదుగుదల, సృష్టి రహస్యానికి ఒక ముఖ్య కారణం. 
• 1996లో సూపర్ సైక్లోన్ వచ్చినప్పుడు కొన్ని వేలమంది చనిపోయారు. ఆ రోజు ఉదయం నేను హడావిడిగా ఇక్కడకు వచ్చి చూస్తే, వ్యవస్థ మొత్తం చిన్నాభిన్నమైంది. నన్ను వెళ్లొద్దని, ప్రాణాపాయమని అడ్డుకున్నారు. అయినా లెక్కచేయకుండా ప్రజల్ని కాపాడటానికి ఇక్కడికి వచ్చాను. పరిస్థితి అంతా గమనించి, సెక్రటేరియట్ మొత్తాన్ని రాజమహేంద్రవరంలో  ఏర్పాటు చేసి, ప్రతి కుటుంబానికి న్యాయం చేశాకే తిరిగి హైదరాబాద్ వెళ్లాను. అదీ నా పట్టుదల. 
• తెలుగు మహిళలు ప్రపంచానికే ఆదర్శంగా నిలవాలన్నదే నా ఆలోచన. దాని నుంచి పుట్టిందే మహాశక్తి కార్యక్రమం. తల్లికి వందనం కింద ఒక ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలుంటే, ఒక్కొక్కరికీ రూ.15 వేల చొప్పున అందిస్తాను. 
• ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు నెలకు రూ.1500 చొప్పున, సంవత్సరానికి రూ.18 వేలు అందిస్తాను. ఆ సొమ్ముని సద్వినియోగం చేసుకొని ఏటేటా ఎలా పెంచుకోవాలో కూడా మీకు తెలియచేస్తాను.
• దీపం పథకంలో భాగంగా ఏటా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించడంతో పాటు, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కూడా మహాశక్తిలో భాగం చేశాను. వీటన్నింటిని మించింది పేదరిక నిర్మూలన. ఒకప్పుడు చిన్నచిన్న అవసరాలకోసం భర్తల్ని, తల్లిదండ్రుల్ని డబ్బులు అడిగిన మహిళలు నేడు, వారికే ఇచ్చే స్థాయికి వచ్చారు. అదీ నేను వారికిచ్చిన చేయూత. 
• సాధారణ కుటుంబంలో పుట్టిన జీ.ఎం.సీ బాలయోగి ఏ స్థానానికి వెళ్లాడో, ఎంత అభివృద్ధి చేశాడో చూస్తున్నాం. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన నేను మీ ముందున్నాను. సమర్థవంతమైన నాయకత్వం ఉంటే సాధ్యం కానిదంటూ ఏమీ లేదు.
• ఈ ప్రభుత్వంలో అంతా రివర్స్ లో నడుస్తోంది. మహిళలకు రక్షణ లేదు. యువతకు ఉపాధి, ఉద్యోగాలు లేవు. తల్లిదండ్రులు తమబిడ్డలు కళ్ల ముందే ఉండాలని కోరుకుంటున్నారు. ఇంటి నుంచే పనిచేస్తూ కుటుంబాలు పోషించుకునే స్థాయికి యువతకు ఉపాధి కల్పిస్తాను.
• మహిళంతా ఒక రాఖీని 45 రోజుల పాటు పూజించి చేతికి కంకణంలా కట్టుకొని ఏ పని మొదలుపెట్టినా విజయం సాధిస్తారు. అదే మిమ్మల్ని మంత్ర దండంలా ముందుకు నడిపిస్తుంది. దానికి కావాల్సింది ఆత్మ విశ్వాసమే.
• ఈ సైకో ముఖ్యమంత్రి ఇస్తున్నానన్న పథకాలపై మార్కులు వేద్దాం. అమ్మఒడి అందరికీ ఇచ్చాడా? ఇవ్వకపోతే 10కి 10 మార్కులు పడతాయా? రూ.15 వేలు ఇస్తానని చెప్పి, రూ.13 వేలు ఇస్తున్నాడు. పేదలందరికీ ఇళ్లు అన్నాడు... ఇచ్చాడా? మద్యపాన నిషేధం అమలు చేస్తానని చెప్పి, ఈ దుర్మార్గుడు ఆడవాళ్ల పుస్తెలు తెంపుతున్నాడు. డ్వాక్రా గ్రూపుల బకాయిలు మొత్తం చెల్లిస్తానని చెప్పి, చేశాడా? పింఛన్లు రూ.3వేలు చేశాడా? ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళల పింఛన్ వయోపరిమితి 45 ఏళ్లకు తగ్గిస్తాను అన్నాడు... తగ్గించాడా? రూ.200 పింఛన్ ని రూ.2 వేలు చేసింది నేను. పెళ్లికానుక సాయాన్ని రూ.లక్షకు పెంచుతానన్నాడు... పెంచాడా? అంగన్ వాడీ సిబ్బంది జీతాలు పెంచాడా? ఇలాంటి ముఖ్యమంత్రి మహిళాద్రోహి కాడా? పేదల ద్రోహి కాడా?
• సిగ్గులేకుండా 98 శాతం హామీలు అమలు చేశానంటున్నాడు. పదేపదే అబద్ధాలతో వ్వవస్థల్ని నాశనం చేశాడు. ప్రజల్ని మోసగించాడు. 


More Telugu News