Liquor Shops: మద్యం షాపుల టెండర్లకు ముగిసిన గడువు... తెలంగాణ ఎక్సైజ్ శాఖకు కాసుల పంట!

  • తెలంగాణలో మద్యం షాపుల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
  • నేడు చివరి రోజు... ఇవాళ ఒక్కరోజే 30 వేలకు పైగా దరఖాస్తులు
  • మొత్తం దరఖాస్తుల సంఖ్య లక్ష దాటిన వైనం
  • ఎక్సైజ్ శాఖకు రూ.2 వేల కోట్ల ఆదాయం!
Applications time line for liquor shops in Telangana ends today

తెలంగాణలో మద్యం దుకాణాల లైసెన్స్ లకు దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగిసింది. గతేడాదిని మించి దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 2,620 షాపులకు టెండర్లు పిలవగా, ఈ సాయంత్రానికి 1.03 లక్షల దరఖాస్తులు వచ్చాయి. గతేడాది వచ్చిన దరఖాస్తుల సంఖ్య 79 వేలు కాగా, ఈసారి లక్ష మార్కు దాటడం విశేషం. ఒక్క వికారాబాద్ జిల్లాలో 59 దుకాణాలకు అధికారులు నోటిఫికేషన్ ఇవ్వగా, 2 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. 

కాగా, ఇవాళ చివరి రోజు కావడంతో ఒక్కరోజే 30 వేలకు పైగా దరఖాస్తులు వచ్చిపడ్డాయి. దరఖాస్తు రుసం రూపంలోనే ఎక్సైజ్ శాఖకు రూ.2 వేల కోట్లకు పైగా ఆదాయం వచ్చినట్టు అంచనా వేస్తున్నారు. 

దుకాణాల లైసెన్స్ లు దక్కించుకునేందుకు మద్యం వ్యాపారులు సిండికేట్ గా మారినట్టు సమాచారం. ఓ వ్యాపారి తన పార్ట్ నర్ లతో కలిసి ఏకంగా 999 దరఖాస్తులు దాఖలు చేసినట్టు తెలిసింది. 

ఈ నెల 21న నిర్వహించే లక్కీ డ్రాతో దుకాణాలు ఎవరికి దక్కేదీ తేలనుంది. అదే రోజున మద్యం దుకాణాలకు లైసెన్స్ లు అందజేస్తారు. డిసెంబరు 1 నుంచి కొత్త మద్యం దుకాణాలు విక్రయాలు షురూ చేయనున్నాయి.

More Telugu News